ఎట్టకేలకు టీచర్ల.. బదిలీలు పూర్తి

ABN , First Publish Date - 2021-01-17T05:34:25+05:30 IST

కోర్టు వివాదాలు, ఆన్‌లైన్‌లో లోపాలు, ఉపాధ్యాయుల ఆందోళనలు నడుమ ఎట్టకేలకు బదిలీల కౌన్సెలింగ్‌ దాదాపు పూర్తయింది.

ఎట్టకేలకు టీచర్ల.. బదిలీలు పూర్తి

జిల్లాలో 2,500మందికి పైగా స్థాన చలనం


గుంటూరు(విద్య), జనవరి 16: కోర్టు వివాదాలు, ఆన్‌లైన్‌లో లోపాలు, ఉపాధ్యాయుల ఆందోళనలు నడుమ ఎట్టకేలకు బదిలీల కౌన్సెలింగ్‌ దాదాపు పూర్తయింది. ఒక్క స్కూల్‌ అసిస్టెంట్‌ హిందీ, తెలుగు, హెచ్‌ఎం కేటగిరి ఉపాధ్యాయులకు మినహా దాదాపు అందరికి బదిలీ ప్రక్రియ పూర్తి చేశారు. ఇప్పటికే కొంతమంది పాఠశాలల్లో చేరి రిపోర్టు చేయగా, మరికొందరు నేడు రిపోర్టు చేయనున్నారు. జిల్లాలో ఈసారి ఉపాధ్యాయుల బదిలీ కోసం మొత్తం 5,885 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో గ్రేడు-2 హెచ్‌ఎం, ఎస్జీటీ తెలుగు, ఉర్దూ, స్కూల్‌ అసిస్టెంట్‌ గణితం, ఫిజికల్‌ సైన్స్‌, బయాలజీ, సోషల్‌స్టడీస్‌, ఉర్దూ, ఆంగ్లం, హిందీ తదితర క్యాడర్‌ ఉపాధ్యాయులు ఉన్నారు. జిల్లాలో తప్పనిసరిగా బదిలీ అయ్యే ఉపాధ్యాయులు 2,199 మంది ఉన్నారు. అదేవిధంగా రిక్వెస్టు బదిలీకి దాదాపు 3,662 మంది దరఖాస్తు చేసుకున్నారు. కొత్త సంవత్సరంలో దాదాపు 2,500 మంది ఉపాధ్యాయులు బదిలీ అయి ఆయా పాఠశాలల్లో చేరనున్నారు. ఇదిలా ఉంటే కోర్టు కేసుల నేపథ్యంలో హెచ్‌ఎం, స్కూల్‌ అసిస్టెంట్‌ తెలుగు, హిందీ ఉపాధ్యాయులకు కౌన్సెలింగ్‌ జరగలేదు. ఈనెల 22న వీరికి వెబ్‌ కౌన్సిలింగ్‌ నిర్వహిస్తారు. దీంతో ఆయా విభాగాల్లో దాదాపు 450 మంది ఉపాధ్యాయులకు స్థానచలనం కలుగనుంది.

Updated Date - 2021-01-17T05:34:25+05:30 IST