రోడ్డున పడ్డ 50 మంది ఉపాధ్యాయులు

ABN , First Publish Date - 2022-07-06T06:47:22+05:30 IST

రాజమహేంద్రవరం హితకారిణి ట్రస్ట్‌ ఆధీనంలో నడపడుతున్న ఎస్‌కేవీటి ఇంగ్లీషు మీడియం స్కూల్‌లో గత 30 ఏళ్ళుగా పనిచేస్తున్న అన్‌ఎయిడెడ్‌ ఉపాధ్యాయులు 50 మంది రోడ్డున పడ్డారు.

రోడ్డున పడ్డ 50 మంది ఉపాధ్యాయులు
ఎస్‌కేవీటీ పాఠశాల ఆవరణలో నిరసన ప్రదర్శన చేస్తున్న అన్‌ ఎయిడెడ్‌ ఉపాధ్యాయులు

ప్రభుత్వంలో ఎస్‌కేవీటీ కళాశాల విలీనం పేరుతో తొలగింపు

ఇప్పుడెలా బతకాలంటూ ఆవేదన

పాఠశాల వద్ద నిరసన


రాజమహేంద్రవరం సిటీ, జూలై 5 : రాజమహేంద్రవరం హితకారిణి ట్రస్ట్‌ ఆధీనంలో నడపడుతున్న ఎస్‌కేవీటి ఇంగ్లీషు మీడియం స్కూల్‌లో గత 30 ఏళ్ళుగా పనిచేస్తున్న అన్‌ఎయిడెడ్‌ ఉపాధ్యాయులు 50 మంది రోడ్డున పడ్డారు. ఈ విద్యా సంస్థలను ప్రభుత్వంలో విలీనం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబరు 103, 104లను జారీ చేయడంతో అన్‌ ఎయిడెడ్‌ ఉపాధ్యాయులు తొలగించబడ్డారు. దీంతో వారంతా మంగళవారం పాఠశాల వద్ద ధర్నా చేశారు. బాధిత ఉపాధ్యాయులు వరహాలు, భుజంగరావు, కామాక్షి , ప్రశాంతి తదితరులు మాట్లాడారు. ఎస్‌కేవీటీ ఇంగ్లీషు మిడీయం ఎయిడెడ్‌ స్కూల్‌ను, ఉపాధ్యాయులను, స్కూల్‌ ఎసెట్స్‌ను ప్రభుత్వంలో విలీనం చేస్తున్నారని అప్పటి కరస్పాండెంట్‌ రామ్మోహనరావు తమ నుంచి విల్లింగ్‌ తీసుకోగా అప్పుడు తామంతా సంతకాలు చేశామన్నారు.దశాబ్దాలుగా పనిచేస్తున్న తమను కాదని ఎక్కడెక్కడి నుంచో ఎయిడెడ్‌ ఉపాధ్యాయులను ఎస్‌కేవీటీ స్కూల్‌కు తీసుకువచ్చి అపాయింట్‌ చేసిన ప్రభుత్వం తమను మాత్రం వెళ్లిపోమని చెప్పడం అన్యాయమన్నారు.తమను రోడ్డున పడేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని హితకారిణి సమాజం ట్రస్ట్‌ చైర్మన్‌ను కోరితే తమను నుంచి డబ్బులు తీసుకుని అమరావతి వెళ్లి మాట్లాడతానని చెప్పి ఇప్పుడు ఎమి మాట్లాడటంలేదన్నారు.  45 నుంచి 50 ఏళ్ళ పైబడిన వయసు కలిగి ఉన్న తమకు ఇదే జీవనాధారమని ఇప్పుడు అకస్మాత్తుగా వెళ్లిపోమనడం ఎంత వరకు న్యాయమని ప్రశ్నించారు. దీనిపై స్కూల్‌ హెచ్‌ఎం సుబ్రహ్మణ్యంను వివరణ కోరగా గతంలో ఈ స్కూల్‌ ప్రభుత్వంలో విలీనం చేయాలని ప్రతిపాదన వచ్చినప్పుడు స్కూల్‌ ఎసెట్స్‌తో పాటు ఎయిడెడ్‌, అన్‌ఎయిడెడ్‌ ఉపాధ్యాయులను కొనసాగించాలనే నివేదికను కరస్పాండెంట్‌ ద్వారా ప్రభుత్వానికి అందించారని అయితే ప్రభుత్వ జీవోలో 21 మంది ఎయిడెడ్‌ ఉపాధ్యాయులను కేటాయించారని తెలిపారు.  

Updated Date - 2022-07-06T06:47:22+05:30 IST