టీచర్లే టార్గెట్‌!

ABN , First Publish Date - 2022-08-17T08:54:22+05:30 IST

పాఠ్య ప్రణాళిక రాయకపోతే నోటీసు. ఒకవేళ రాసినా... అది సరిగ్గా లేకపోతే మరో నోటీసు.

టీచర్లే టార్గెట్‌!

  • పాఠ్య ప్రణాళిక రాయకుంటే షోకాజ్‌  
  • హాజరు అప్‌లోడ్‌ చేయకపోతే నోటీసులు
  • వేసవి సెలవుల విషయంలోనూ తిప్పలు 
  • ఇప్పుడు ముఖ హాజరు పేరిట గుదిబండ 
  • ఇక ప్రతి టీచర్‌కూ స్మార్ట్‌ఫోన్‌ తప్పనిసరి
  • కక్షసాధింపే అంటున్న సంఘాలు 

(అమరావతి-ఆంధ్రజ్యోతి): పాఠ్య ప్రణాళిక రాయకపోతే నోటీసు. ఒకవేళ రాసినా... అది సరిగ్గా లేకపోతే మరో నోటీసు. 10.30కల్లా విద్యార్థుల హాజరు అప్‌లోడ్‌ చేయకపోతే నోటీసు. బేస్‌లైన్‌ పరీక్షల్లో విద్యార్థులు మెరుగుపడకపోతే చర్యలు.. ఇలా టీచర్లను ము ప్పతిప్పలు పెడుతోన్న వైసీపీ ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చిన ఫేషియల్‌ రికగ్నిషన్‌(ముఖహాజరు) విధానం వారి ఇబ్బందులను రెట్టింపు చేస్తోంది. ఇప్పటికే ఉపాధ్యాయులే లక్ష్యంగా కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారనే వాదన వినిపిస్తున్న తరుణంలో తాజా చర్యలు బలం చేకూరుస్తున్నాయి. పీఆర్‌సీ, సీపీఎస్‌ రద్దుపై ఫిబ్రవరిలో జరిగిన ‘చలో విజయవాడ’ నాటినుం చే తమపై ఒత్తిళ్లు మొదలయ్యాయని టీచర్లు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వాన్ని తీవ్ర కలవరపాటుకు గురిచేసిన నాటి నిరసన కార్యక్రమాల్లో ఇతర ఉద్యోగుల కంటే ఉపాధ్యాయులే కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత వేసవి సెలవుల విషయంలో నూ ప్రభుత్వం టీచర్లను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసింది. ఈ ఏడాది బడులు తెరిచిన నాటినుంచి కొత్త నిబంధనలు తెచ్చి ముప్పేట దాడికి దిగింది. పాఠ్య ప్రణాళిక రాయకపోయి నా పలుచోట్ల టీచర్లకు షోకాజ్‌ నోటీసులు జారీచేశారు. 


ఓ జిల్లాలో మరీ విచిత్రంగా పాఠ్య ప్రణాళిక రాసినా అది సరిగా లేదని నోటీసులు ఇచ్చారు. ఇక ఉదయం 10.30 గంటలలోపు విద్యార్థుల హాజరు వేయలేదనే కారణంతో రాష్ట్రవ్యాప్తంగా వందల మంది హెచ్‌ఎంలకు నోటీసులు జారీ అయ్యాయి. ఇంటర్నెట్‌ పని చేయకపోయినా, యాప్‌లు ఎలా ఉన్నా కచ్చితంగా ఆ సమయానికి విద్యార్థుల హాజరువేసి అప్‌లోడ్‌ చేసి తీరాలనే నిబంధన పెట్టారు. ఇంకోవైపు బేస్‌లైన్‌ పరీక్షల్లో విద్యార్థుల పనితీరు మెరుగుపడాలని లేనిపక్షంలో టీచర్‌పై చర్యలు తీసుకోవాలని మరో ఆదేశం ఇచ్చారు. ఇప్పుడు ముఖ హాజరు మరో గుదిబండలా మారింది. ఉపాధ్యాయుల వద్ద ప్రభుత్వం సూచించిన ఫోన్లు ఉండాలని వైసీపీ సర్కారు నిబంధన విధించింది. అందులోనూ ఐఫోన్‌ ఉంటే కుదరదు. కచ్చితంగా ఆండ్రాయిడ్‌ ఫోన్‌ మాత్రమే ఉండాలి. తాజాగా తెచ్చిన ముఖ హాజరు విధానంతో ప్రభుత్వం పరోక్షంగా స్మార్ట్‌ ఫోన్లను టీచర్లకు తప్పనిసరి చేసినట్లయింది. దీంతో ప్రతి టీచర్‌ ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్‌ కొనాలి. స్మార్ట్‌ ఫోన్‌, యాప్‌ల పై అవగాహన లేదన్నా కుదరదు. ఫోన్‌ కొని, అందులో సూ చించిన యాప్‌లు డౌన్‌లోడ్‌ చేసుకొని వినియోగించాల్సిందే. 


నిమిషం నిబంధనపై ఆగ్రహం 

సమయపాలనపై టీచర్లకు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. 9కే పాఠశాలకు వచ్చి తీరాలని, నిమిషం దాటినా సెలవు తప్పదని ఆదేశించారు. గతంలో బయోమెట్రిక్‌ విధా నం ఉన్నప్పుడు సమయం కొంత అటూఇటూ అయినా హాజ రు తీసుకునేవారు. కానీ ఇప్పుడు ఆటోమేటిక్‌గా సెలవు పెట్టే యాప్‌ తేవడంపై టీచర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  

Updated Date - 2022-08-17T08:54:22+05:30 IST