ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కసరత్తు

ABN , First Publish Date - 2020-11-19T06:19:24+05:30 IST

కృష్ణా, గుంటూరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోలాహలం మొదలైంది.

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కసరత్తు

స్వతంత్ర అభ్యర్థిగా మరోసారి ఏఎస్‌ రామకృష్ణ!

యూటీఎఫ్‌ నుంచి బొడ్డు నాగేశ్వర


(ఆంధ్రజ్యోతి, విజయవాడ)

కృష్ణా, గుంటూరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోలాహలం మొదలైంది. ప్రస్తుతం కృష్ణా, గుంటూరు జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా వ్యవహరిస్తున్న ఏఎస్‌ రామకృష్ణ పదవీకాలం 2021 మార్చి నాటికి ముగియనుంది. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు రెండు జిల్లాల యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే ఒక విడత ఉపాధ్యాయ ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని రెండు జిల్లాల అధికారులు పూర్తి చేశారు. ఈ ఏడాది అక్టోబరు ఒకటి నుంచి తొలి విడత ఉపాధ్యాయ ఓటర్ల నమోదుకు అధికారులు శ్రీకారం చుట్టారు. మలి విడత నమోదు కార్యక్రమం డిసెంబరు ఒకటి నుంచి ప్రారంభమవుతుంది. గత ఆరేళ్లలో మూడేళ్లపాటు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పనిచేసిన వారు ఉపాధ్యాయ ఓటర్లుగా నమోదు చేసుకోవచ్చు. 


ప్రభుత్వ జూనియర్‌, డిగ్రీ కాలేజీలు, యూనివర్సిటీల్లో పనిచేసే అధ్యాపకులు సైతం ఉపాధ్యాయ ఓటర్లుగా నమోదు చేసుకోవడానికి అర్హులు. ప్రైవేటు ఉపాధ్యాయులుగా పనిచేసేవారిలో వరసగా ఆరేళ్లపాటు ప్రావిడెంట్‌ ఫండ్‌ (పీఎఫ్‌) చెల్లింపులు జరిగి ఉన్నవారు ఓటర్లుగా నమోదు చేయించుకోవడానికి అర్హులు. రెండు జిల్లాల్లో కలిపి సుమారు 18వేలకు పైగా ఉపాధ్యాయ ఓటర్లు ఉన్నారు. చేర్పులు, మార్పుల అనంతరం 2021 జనవరి 18న ఉపాధ్యాయ ఓటర్ల తుది జాబితాను ప్రకటించనున్నారు. 2015లో జరిగిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ బలపర్చిన అభ్యర్థిగా ఏఎస్‌ రామకృష్ణ గెలుపొందారు. ఈసారి రామకృష్ణ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసే అవకాశాలున్నాయి. యూటీఎఫ్‌ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావుతోపాటు పలువురి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఈసారి అధికార పార్టీ వైసీపీకి అనుబంధంగా ఉన్న ఉపాధ్యాయ సంఘం వైఎస్‌ఆర్‌టీఎఫ్‌ నుంచి కూడా అభ్యర్థి బరిలో నిలబడే అవకాశాలున్నాయి. 

Updated Date - 2020-11-19T06:19:24+05:30 IST