Team India కు బిగ్ షాక్.. రోహిత్ శర్మకు కరోనా పాజిటివ్

ABN , First Publish Date - 2022-06-26T14:08:11+05:30 IST

ఇంగ్లాండ్‌లో ఒక టెస్ట్ మ్యాచ్ కోసం వెళ్లిన భారత జట్టుకు బిగ్ షాక్ తగిలింది. జట్టు సారథి రోహిత్‌ శర్మ కరోనా బారిన పడ్డాడు.

Team India కు బిగ్ షాక్.. రోహిత్ శర్మకు కరోనా పాజిటివ్

లండన్: ఇంగ్లాండ్‌లో ఒక టెస్ట్ మ్యాచ్ కోసం వెళ్లిన భారత జట్టుకు బిగ్ షాక్ తగిలింది. జట్టు సారథి రోహిత్‌ శర్మ కరోనా బారిన పడ్డాడు. శనివారం నిర్వహించిన యాంటిజెన్‌ పరీక్షల్లో అతడికి కోవిడ్-19 పాజిటివ్‌గా తేలిందని బీసీసీఐ (BCCI) తాజాగా ట్విటర్ ద్వారా వెల్లడించింది. ప్రస్తుతం టీమిండియా బస చేసిన హోటల్‌లోనే హిట్‌మ్యాన్ ప్రత్యేకంగా క్వారంటైన్‌లో ఉన్నట్లు తెలిపింది. కాగా, రోహిత్‌ ప్రస్తుతం లీసెస్టర్‌ జట్టుతో జరుగుతోన్న వార్మప్‌ మ్యాచ్‌లో గురువారం తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌‌కు దిగాడు. కానీ, శనివారం నాటి రెండో ఇన్నింగ్స్‌‌లో బ్యాటింగ్‌కు దిగలేదు. ఇదిలాఉంటే.. గతేడాది పూర్తికావాల్సిన 5 టెస్టుల ఈ సిరీస్‌లో నాలుగు మ్యాచ్‌లు పూర్తి అయిన తర్వాత కరోనా కారణంగానే ఐదో మ్యాచ్‌ వాయిదా పడింది. అప్పటికీ ఈ సిరీస్‌లో భారత జట్టు 2-1 ఆధిక్యంలో నిలిచింది.


ఇప్పుడు వాయిదా పడ్డ ఐదో టెస్టు ఆడేందుకే రోహిత్ సారథ్యంలోని భారత జట్టు ఇంగ్లాండ్ వెళ్లింది. వచ్చే నెల 1వ తేదీ నుంచి బర్మింగ్‌హామ్ వేదికగా ఈ టెస్టు జరగనుంది. అయితే, ఈ మ్యాచ్‌కు ముందు ఇలా రోహిత్‌కు వైరస్ సోకడం టీమ్‌ఇండియాకు పెద్ద షాకనే చెప్పాలి. ఇక రోహిత్‌ ఈ టెస్టుకు ముందు కోలుకుంటే కెప్టెన్‌గా బరిలోకి దిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రోహిత్ త్వరగా కోలుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. ఒకవేళ ఈ మ్యాచ్‌కు రోహిత్ దూరమైతే మాత్రం భారత జట్టుకు పెద్ద ఎదురుదెబ్బే. 



Updated Date - 2022-06-26T14:08:11+05:30 IST