రాంజీకి కన్నీటి వీడ్కోలు

ABN , First Publish Date - 2021-03-09T10:04:39+05:30 IST

టీడీపీ నాయకులు, జిల్లా తెలుగు యువత అధ్యక్షులు మాగంటి రాంజీ అంత్యక్రియలు సోమవారం పూర్తయ్యాయి. చాటపర్రులో సొంత తోటలో బంధువులు, అభిమానులు

రాంజీకి కన్నీటి వీడ్కోలు

ఏలూరు టూటౌన్‌, మార్చి 8: టీడీపీ నాయకులు, జిల్లా తెలుగు యువత అధ్యక్షులు మాగంటి రాంజీ అంత్యక్రియలు సోమవారం పూర్తయ్యాయి. చాటపర్రులో సొంత తోటలో బంధువులు, అభిమానులు అశ్రునయనాల మధ్య అంతిమ సంస్కారాలు జరిగాయి. ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం మధ్యాహ్నం వరకూ పలువురు నాయకులు, టీడీపీ కార్యకర్తలు, అభిమానులు కడసారి తమ ప్రియతమ నాయకుడిని చూసేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చి నివాళులర్పించారు. మాగంటి బాబు దంపతులను, కుటుంబసభ్యులను ఉపముఖ్యమంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివా్‌స (నాని), ఎమ్మెల్యేలు కొఠారు అబ్బయ్యచౌదరి, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, మంతెన రామరాజు, ఎమ్మెల్సీలు మంతెన సత్యనారాయణరాజు, రాము సూర్యారావు, ఎంపీ కేశినేని నాని, మాజీ మంత్రి పితాని సత్యనారాయణ, మాజీ ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి సహా పలువురు ప్రముఖులు పరామర్శించారు.


మాగంటి బాబుకు లోకేశ్‌ పరామర్శ

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేశ్‌.. మాగంటి బాబును సోమవారం సాయంత్రం పరామర్శించారు. ఏలూరులోని బాబు నివాసానికి వచ్చిన లోకేశ్‌.. ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు.  పార్టీ, కార్యకర్తలు, నాయకులు మేమంతా మీకు అండగా ఉంటామని ధైర్యం చెప్పారు.

Updated Date - 2021-03-09T10:04:39+05:30 IST