గిరిజన తండాల్లో ఘనంగా తీజ్ ఉత్సవాలు
ABN , First Publish Date - 2022-08-12T05:41:05+05:30 IST
మండలంలోని జిల్లెలగడ్డ గిరిజన తండాలో గురువారం ఘనంగ తీజ్ ఉత్సవాలు నిర్వహించారు.
హుస్నాబాద్ రూరల్/అక్కన్నపేట, ఆగస్టు 11: మండలంలోని జిల్లెలగడ్డ గిరిజన తండాలో గురువారం ఘనంగ తీజ్ ఉత్సవాలు నిర్వహించారు. యువతులు తమకు మంచి వరుడుకావాలని దైవాన్ని కోరుతూ భక్తి శ్రద్ధలతో పండుగను జరుపుకోవడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది. గిరిజన యువతులు తొమ్మిది రోజులు అత్యంత నిష్టంగా ఉపవాసాలు చేస్తారు. ఆకుకూరలు, సజ్జల రొట్టలతో ఒకే పూట ఆహారం తీసుకుంటూ పూజలు చేస్తారు. పండుగలో భాగంగా తొలుత పుట్టమట్టిని తీసుకొచ్చి, వెదురుబుట్టలో దాన్ని వేసి ఆందులో గోధుమలు పోసి మొలకలు పెంచుతారు. ఇవి ఎంత పచ్చగా ఉంటే భవిష్యత్లో అంత ఆయురోగ్యాలు, సంతోషాలు కలుగుతాయని వారి నమ్మకం. ఉత్సవాల చివరి రోజున బుట్టల నుంచి మొలకలు వేరు చేసి పురుషుల తలపై పెడతారు. వాటిని ఇళ్లకు తీసుకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆనంతరం మొలకలను బాజ భజంత్రీల నడుమ పాటలు పాడుతూ ఊరేగింపుగా తీసుకెళ్లి సమీపంలోని చెరువులు, కుంటలు బావులలో నిమజ్జనం చేస్తారు. తమ వెంట తెచ్చుకున్న ఫలహారాన్ని పంచుకుని తింటారు. యువతుల సోదరులు నీటితో యువతుల పాదాలు కడిగి నమస్కారం చేయడంతో పండుగ ముగుస్తుంది. ఈ కార్యక్రమంలో ఎంపీపీ లకావత్ మానస, సర్పంచ్ లావుడ్య స్వరూప, ఉపసర్పంచ్, మాజీ సర్పంచ్ విజయ, తిరుపతి, లకావత్ సుభాష్, లావుడ్య లింగానాయక్, గిరిజన పెద్దలు పాల్గొన్నారు. అక్కన్నపేట మండలంలోని పంతులుతండాలో గురువారం గిరిజనులు తీజ్పండుగను అట్టహాసంగా నిర్వహించారు. తొమ్మిది రోజుల పాటు పూజలు చేసి పెంచిన మొలకల బుట్టలను పందిరి వద్ద నుంచి గిరిజనులు,యువతులు నెత్తిన ఎత్తుకొని ఊరేగించి, అనంతరం సమీపంలోని కుంటలో నిమజ్జనం చేశారు.