19 ఏళ్ల యువతిపై ఐదుగురు యువకుల అత్యాచారం, ఆపై కత్తిపోట్లు.. అసలు విషయం తెలిసి..
ABN , First Publish Date - 2021-01-21T21:52:22+05:30 IST
ఐదుగురు వ్యక్తులు తనను కిడ్నాప్ చేసి అఘాయిత్యానికి పాల్పడ్డారని, ఆపై తనను పొడిచారంటూ
న్యూఢిల్లీ: ఐదుగురు వ్యక్తులు తనను కిడ్నాప్ చేసి అఘాయిత్యానికి పాల్పడ్డారని, ఆపై తనను పొడిచారంటూ 19 ఏళ్ల కాలేజీ అమ్మాయి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తీవ్ర గాయాలతో రక్తమోడుతున్న ఆమెను పోలీసులు ఆసుపత్రిలో చేర్పించారు. అయితే, ఆ తర్వాత అసలు విషయం తెలిసి పోలీసులు విస్తుపోయారు. పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ముందు యువతి తనను తానే పొడుచుకుందని తెలిసి ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం యువతి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె కోలుకుంటే కానీ, ఆమె ఎందుకిలా కేసు పెట్టిందీ తెలిసే అవకాశం లేదని పోలీసులు పేర్కొన్నారు. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో జరిగిందీ ఘటన.
ఆమె చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని, ఆమెకు అయిన కత్తి గాయాలు తనకు తానే చేసుకున్నవని దర్యాప్తులో తేలినట్టు పోలీసులు పేర్కొన్నారు. అయితే, తప్పుడు కేసు పెట్టినందుకు పోలీసులు ఆమెపై ఎటువంటి కేసు నమోదు చేయకపోవడం గమనార్హం. ఫిర్యాదులో ఆమె పేర్కొన్న ప్రధాన నిందితుడితో ఆమె ప్రేమలో ఉందని, ఇందరూ అదే ప్రాంతంలో కలిసి ఉండేవారని పోలీసులు పేర్కొన్నారు.
మంగళవారం యువతి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తనను ఇద్దరు కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని, ఆ తర్వాత ముగ్గురు వ్యక్తులు తనను కత్తితో పొడిచి, గోనె సంచిలో కుక్కేసి రైల్వే ట్రాక్పై పడేశారని పేర్కొంది. ఆ తర్వాత స్థానికుల సాయంతో తాను తప్పించుకుని బయటపడి ‘మై హాస్పిటల్’కు చేరుకున్నానని వివరించింది.
దర్యాప్తులో భాగంగా 150 సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించామని, పరదేశ్పురా నుంచి బంగాంగా వరకు రైల్వే ట్రాక్పై శాస్త్రీయ ఆధారాలు కూడా సేకరించామని ఇండోర్ ఐజీ హరినారాయణ్ తెలిపారు. ఆమె చేసిన ఆరోణలు పూర్తిగా అవాస్తమని దర్యాప్తు వెల్లడైందని పేర్కొన్నారు. తప్పుడు కేసు పెట్టిన ఆమెపై కేసు నమోదు చేస్తామని, ఆమె కోలుకున్న తర్వాత ఆ కేసు ఎందుకు పెట్టిందీ తెలుస్తుందన్నారు.