తీస్తా సెతల్వాడ్‌ అరెస్టు

ABN , First Publish Date - 2022-06-26T07:52:54+05:30 IST

గుజరాత్‌ అల్లర్లకు సంబంధించి ప్రత్యేక దర్యాప్తు బృందాని (సిట్‌)కి తప్పుడు సమాచారం ఇచ్చారన్న ఆరోపణలపై ప్రముఖ జర్నలిస్టు, సామాజిక ఉద్యమకారిణి తీస్తా సెతల్వాడ్‌ను గుజరాత్‌ ఉగ్రవాద నిరోధక బృందం (ఏటీఎస్‌) పోలీసులు అరెస్టు చేశారు.

తీస్తా సెతల్వాడ్‌ అరెస్టు

మాజీ డీజీపీ ఆర్బీ శ్రీకుమార్‌ కూడా.. 

మాజీ ఐపీఎస్‌ సంజీవ్‌ భట్‌పైనా కేసు

గుజరాత్‌ అల్లర్లకు సంబంధించి సిట్‌కు 

తప్పుడు సమాచారం ఇచ్చారని ఆరోపణ

అహ్మదాబాద్‌ క్రైం బ్రాంచ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఫిర్యాదు

సుప్రీం కోర్టు తీర్పిచ్చిన మర్నాడే కేసు

తీస్తాకు వ్యతిరేకంగా అమిత్‌ షా మాట్లాడిన 

కొన్ని గంటల్లోనే కేసు నమోదు.. అరెస్టు

అరెస్టు అక్రమం.. నాకు ప్రాణహాని

సామాజిక ఉద్యమకారిణి తీస్తా వ్యాఖ్యలు


న్యూఢిల్లీ, జూన్‌ 25: గుజరాత్‌ అల్లర్లకు సంబంధించి ప్రత్యేక దర్యాప్తు బృందాని (సిట్‌)కి తప్పుడు సమాచారం ఇచ్చారన్న ఆరోపణలపై ప్రముఖ జర్నలిస్టు, సామాజిక ఉద్యమకారిణి తీస్తా సెతల్వాడ్‌ను గుజరాత్‌ ఉగ్రవాద నిరోధక బృందం (ఏటీఎస్‌) పోలీసులు అరెస్టు చేశారు. శనివారం ముంబైలోని శాంతాక్రజ్‌ ప్రాంతంలోని తీస్తా నివాసంలో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఇవే ఆరోపణలపై మాజీ డీజీపీ ఆర్బీ శ్రీకుమార్‌, మాజీ ఐపీఎస్‌ అధికారి సంజీవ్‌ భట్‌పైనా కేసు నమోదు చేశారు. వీరిలో సంజీవ్‌ భట్‌ ఇప్పటికే మరో కేసు కారణంగా జైల్లో ఉండగా శ్రీకుమార్‌ను కూడా శనివారం అరెస్టు చేశారు.


2002 గుజరాత్‌ అల్లర్ల కేసులో ప్రధాని మోదీకి సిట్‌ క్లీన్‌చిట్‌ ఇవ్వడాన్ని సుప్రీంకోర్టు సమర్ధించడం, ఈ కేసులో సహ పిటిషనర్‌గా ఉన్న తీస్తా సెతల్వాడ్‌ వైఖరిని తప్పుబట్టడం తెలిసిందే. ‘‘ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్న కొందరు ఉన్నతాధికారులు ఇతరులతో కుమ్మక్కై కేసును సం చలనం చేయడానికి ప్రయత్నించారు. వారంతా అల్లర్ల విషయంలో సిట్‌కు తప్పుడు సమాచారం ఇచ్చారు. కేసును తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించిన అధికారులను జైల్లో పెట్టా లి. అలాగే, సొంత ప్రయోజనాల కోసం తీస్తా సెతల్వాడ్‌ ఈ కేసును వాడుకున్నారు. ఆమెపైనా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది’’ అంటూ జకియా జాఫ్రీ పిటిషన్‌ను డిస్మిస్‌ చేస్తూ, ప్రధాని మోదీకి సిట్‌ క్లీన్‌చిట్‌ ఇవ్వడాన్ని సమర్ధిస్తూ శుక్రవారం సుప్రీం కోర్టు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఇక, గుజరాత్‌ అల్లర్ల కేసులో తీస్తా సెతల్వాడ్‌కు చెందిన స్వ చ్ఛంద సంస్థ కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చిందని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా శనివారం ఓ ఇంటర్వ్యూలో ఆరోపించారు. ఆయన ఆ వ్యాఖ్యలు చేసిన గంటల వ్యవధిలోనే అహ్మదాబాద్‌ క్రైం బ్రాంచ్‌ అధికారుల ఫిర్యాదు మేరకు సెతల్వాడ్‌, సంజీవ్‌ భట్‌, శ్రీకుమార్‌లపై గుజరాత్‌ ఏటీఎస్‌ కేసులు నమోదు చేసింది. మరణ శిక్ష విధించడానికి అవకాశము న్న నేరంలో కొందరు వ్యక్తులను దోషులుగా ఇరికించడానికి సెతల్వాడ్‌, సంజీవ్‌ భట్‌, శ్రీకుమార్‌ కుట్ర పూరితంగా తప్పుడు సాక్ష్యాలను పుట్టించి, న్యాయ ప్రక్రియను దుర్వినియోగం చేశారని క్రైం బ్రాంచ్‌ ఇన్‌స్పెక్టర్‌ డీబీ బారాద్‌ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.


అమాయ క వ్యక్తులపై తప్పుడు, దురుద్దేశపూర్వక క్రిమినల్‌ ప్రొసీడింగ్స్‌ పెట్టారని, తద్వారా పలువురిని దెబ్బతీయాలని భావించారని, తప్పుడు రికార్డులను తయారు చేశారని పేర్కొన్నారు. వారిపై ఐపీసీ సెక్షన్లు 468 (మోసం చేయడానికి ఫోర్జరీ చేయ డం); 471(ఫోర్జరీ చేసిన డాక్యుమెంట్‌ను అసలు డాక్యుమెంట్‌గా ఉపయోగించడం); 194 (మరణ శిక్ష విధించేలా తప్పుడు సాక్ష్యం సృష్టించడం), 211 (గాయపరచడానికి క్రిమినల్‌ ప్రొసీడింగ్స్‌కు కారణం కావడం); 120(బి)(తప్పుడు ఆరోపణలు చేయడం) కింద కేసులు నమోదు చేశారు. ఆ వెంటనే సెతల్వాడ్‌ను, శ్రీకుమార్‌ను అరెస్టు చేశా రు. సెతల్వాడ్‌ను ముంబై నుంచి అహ్మదాబాద్‌ కు తరలించారు. ఈ నేపథ్యంలో తీస్తాకు చెంది న స్వచ్ఛంద సంస్థ సిటిజన్స్‌ ఫర్‌ జస్టిస్‌ అండ్‌ పీస్‌(సీజేపీ) వ్యవహారాలపైనా దర్యాప్తు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే తీస్తాపై విదేశీ సహకార నియంత్రణ చట్టం(ఎఫ్‌సీఆర్‌ఏ) కింద కేసు నమోదైంది. 2002 అల్లర్ల బాధితుల తరఫున నిర్వహిస్తున్న ఉద్యమానికి సహకారం పేరుతో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆమోదం లేకుండానే విదేశాల నుం చి తీస్తా సెతల్వాడ్‌ నిధులు సేకరిస్తున్నారనే ఆరోపణలపై సీబీఐ 2015లో ఆమెపై కేసు నమోదు చేసింది. ఈ అంశం ఇప్పుడు మళ్లీ తెరపైకి వచ్చే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 


నాకు ప్రాణ హాని: సెతల్వాడ్‌

తనను అక్రమంగా అరెస్టు చేశారని, తన ప్రాణానికి ముప్పు ఉందని తీస్తా సెతల్వాడ్‌ అన్నారు. జూహులో అదుపులోకి తీసుకున్న తర్వాత స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడానికి ఏటీఎస్‌ పోలీసులు ఆమెను శాంతాక్రజ్‌ పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు. అయితే తన అరెస్టుపై తీస్తా సెతల్వాడ్‌ కూడా శాంతాక్రజ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. తనను అక్రమంగా అరెస్టు చేశారని, తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. సెతల్వాడ్‌ ఇంట్లోకి దౌర్జన్యంగా వెళ్లి ఆమెపై దాడి చేశారని ఆమె తరఫు న్యాయవాది ఆరోపించారు. అయితే, ఆ ఆరోపణను స్థానిక పోలీసు అధికారులు ఖండించారు.


జకియా జాఫ్రి పిటిషన్‌తో..

గుజరాత్‌లో వందల మంది ప్రాణాలు కోల్పోయిన అల్లర్లకు అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న మోదీ సహకారం ఉందంటూ ఆ ఘటనలో మృతి చెందిన కాంగ్రెస్‌ ఎంపీ ఎహ్‌సాన్‌ జాఫ్రి భార్య జకియా జాఫ్రి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై దర్యాప్తునకు కోర్టు ఏర్పాటు చేసిన సిట్‌ బృందం మోదీకి క్లీన్‌చిట్‌ ఇచ్చింది. దీన్ని జకియా జాఫ్రి సుప్రీంకోర్టులో సవాలు చేయగా.. తీస్తా సెతల్వాడ్‌ సహ పిటిషనర్‌గా ఉన్నారు.


శ్రీకుమార్‌ నన్ను కూడా బలిచేశారు: నంబి

భారత నిఘా సంస్థ(ఐబీ) మాజీ డిప్యూటీ డైరెక్టర్‌ బీఎస్‌ శ్రీకుమార్‌ తనను కూడా బలిచేశారని, తప్పుడు ఆధారాలను సృష్టించడంలో దిట్ట అని ఇస్రో మాజీ శాస్త్రవేత్త నంబి నారాయణన్‌ ఆరోపించారు. 1994లో ఇస్రో నుంచి పాక్‌కు సమాచారం లీక్‌ చేసిన కేసులో నంబి నారాయణన్‌ను అక్రమంగా అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ‘‘శ్రీకుమార్‌ అరెస్టు నాకు సంతోషాన్ని కలగజేసింది’’ అని ఆయన వ్యాఖ్యానించారు. కాగా.. 1994 నాటి ఇస్రో గూఢచర్యం కేసులో నంబి నారాయణన్‌తోపాటు మాల్దీవులకు చెందిన మరియం రషీదా, ఫౌజియా హుస్సేన్‌ అనే మహిళలు అరెస్టయిన విషయం తెలిసిందే. 1995లోనే నంబి నారాయణన్‌కు కోర్టు క్లీన్‌చీట్‌ ఇవ్వగా.. ఆయన పోలీసులపై న్యాయపోరాటం చేశారు. 

Updated Date - 2022-06-26T07:52:54+05:30 IST