తెలంగాణ విద్యార్థులకు.. మరో కొత్త చిక్కు!
ABN , First Publish Date - 2021-10-10T13:32:34+05:30 IST
తెలంగాణ విద్యార్థులకు..
ఫీజు రీయింబర్స్మెంట్కు ‘కోడ్’ చిక్కు
హైదరాబాద్: ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు ఇప్పుడు కొత్త చిక్కు వచ్చిపడింది. రెండేళ్లుగా ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ల చెల్లింపులు నిలిచిపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 15 లక్షలమందికిపైగా విద్యార్థులు, తల్లిదండ్రులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఇటీవల కొద్దిమొత్తంలో ప్రభుత్వం నిధులు విడుదల చేసినా.. బ్యాంకుల ఐఎఫ్ఎస్సీ కోడ్లలో మార్పుల కారణంగా చెల్లింపుల్లో ఇబ్బందులు తలెత్తుతున్నట్లు తెలిసింది. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో ఈపాస్ వెబ్సైట్లో ఎడిట్ ఆప్షన్ సదుపాయం కల్పించారు. దీన్ని ఉపయోగించుకుని బ్యాంకు ఐఎఫ్ఎస్సీ కోడ్ మార్చుకోవాలని కాలేజీ నిర్వాహకులు విద్యార్థులు, తల్లిదండ్రులకు సూచిస్తున్నారు.
ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్ షిప్లకు రెండేళ్లుగా ప్రభుత్వం నిధులు విడుదల చేయడం లేదు. 2019-20 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంకా రూ.767 కోట్లకుపైగా నిధులు పెండింగ్లో ఉన్నాయి. ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ల కోసం సుమారు 13 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నట్లు అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. ఈ లెక్కన ప్రస్తుత విద్యా సంవత్సరానికి రూ.2,250 కోట్లు అవసరమని అధికారులు అంచనా వేస్తున్నారు.