మూడు స్వర్ణాల మురిపెం..
ABN , First Publish Date - 2022-10-07T09:09:12+05:30 IST
జాతీయ క్రీడల్లో తెలంగాణ క్రీడాకారులు అదరగొట్టారు. గురువారంనాటి పోటీల్లో మూడు స్వర్ణాలతో సత్తా చాటారు.
బ్యాడ్మింటన్లో రెండు, బాస్కెట్బాల్లో ఒకటి
సింగిల్స్లో సాయిప్రణీత్
డబుల్స్లో సిక్కి-గాయత్రికి టైటిల్
జాతీయ క్రీడల్లో తెలంగాణ హవా
సూరత్: జాతీయ క్రీడల్లో తెలంగాణ క్రీడాకారులు అదరగొట్టారు. గురువారంనాటి పోటీల్లో మూడు స్వర్ణాలతో సత్తా చాటారు. బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్లో సాయిప్రణీత్, మహిళల డబుల్స్లో సిక్కిరెడ్డి/గాయత్రి గోపీచంద్, మహిళల బాస్కెట్బాల్ 5-5లో పసిడి పతకాలతో మెరిశారు. బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో టాప్ సీడ్ సాయిప్రణీత్ 21-11, 12-21, 21-16తో మిథున్ మంజునాథ్ (కర్ణాటక)పై మూడు గేమ్లలో విజయం సాధించి టైటిల్ అందుకున్నాడు.
మహిళల డబుల్స్ తుదిపోరులో సిక్కిరెడ్డి/గాయత్రి గోపీచంద్ ద్వయం 21-14, 21-11 స్కోరుతో అశ్వినీ భట్/శిఖా గౌతమ్ (కర్ణాటక) జోడీని చిత్తు చేసి టైటిల్ కైవసం చేసుకుంది. దాంతో బ్యాడ్మింటన్లో తెలంగాణ ముచ్చటగా మూడు బంగారు పతకాలు దక్కించుకున్నట్టయింది. మిక్స్డ్ టీమ్లో ఇంతకుముందే స్వర్ణ పతకం నెగ్గింది. మహిళల బాస్కెట్బాల్ 5-5 ఫైనల్లో తెలంగాణ 67-62 స్కోరుతో తమిళనాడును ఓడించి పసిడి పతకం సొంతం చేసుకుంది. కేరళ జట్టు కాంస్యం అందుకుంది.
వ్రితికి రజత, కాంస్యాలు:
తెలంగాణ యువ స్విమ్మర్ వ్రితి అగర్వాల్ జాతీయ క్రీడల్లో తన జోరు కొనసాగించింది. 1500 మీ. ఫ్రీస్టయిల్లో రజత పతకం సాధించిన ఆమె..ఉదయం జరిగిన మహిళల 200 మీ. బటర్ఫ్లై విభాగంలో కాంస్య పతకం చేజిక్కించుకుంది.
ఆంధ్రకు టెన్నిస్ డబుల్స్ కాంస్యం:
టెన్నిస్ పురుషుల డబుల్స్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన కొసరాజు శివదీ్ప/అనంతమణి ముని జంట కాంస్య పతకం గెలిచింది.