నచ్చినవారికోసం ఉద్యమకారులను బలిచేస్తున్న కేసీఆర్..ఉద్యమ కోటా పదవులకు అన్యాయం...ఇచ్చినట్లే ఇచ్చి గుంజుకుంటారా..!?
ABN , First Publish Date - 2021-12-03T17:11:47+05:30 IST
ఓడ దాటేదాకా ఓడ మల్లన్న.... దాటాక బోడి మల్లన్న. ఈ సామెత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కి అచ్చం సరిపోతుందని ఆయన్ని విమర్శించేవారు అనేమాట. ప్రత్యేక రాష్ట్రం కోసం కొట్లడిన ఉద్యమకారులకు చెట్టెక్కించేంత హామీలు ఇవ్వడం, పదవులు
పదవుల భర్తీలో ప్రతీసారి కేసీఆర్పై విమర్శలెందుకు వస్తాయి? ఉద్యమకారులకు ఏడేళ్లున్నరేళ్లుగా కేసీఆర్ అన్యాయం చేస్తున్నారనే ఆరోపణలు ఎందుకు ఎదుర్కొంటున్నారు? పదవి గ్యారంటీ అని ప్రామిస్ చేస్తున్న కేసీఆర్ అమలుచేయాల్సిన సమయంలో ఆడినమాట ఎందుకు తప్పుతున్నారు? టీఆర్ఎస్ను ఫక్తు రాజకీయపార్టీగా మార్చి పదవుల విషయంలో కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయాలతో బలి పశువులు అవుతున్నామని ఉద్యమకారులు అనుకుంటున్నారా? అనే మరిన్ని విషయాలు ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ఇన్సైడ్లో తెలుసుకుందాం..
హామీలతో చెట్టెక్కించి కిందపడేస్తున్న కేసీఆర్!
ఓడ దాటేదాకా ఓడ మల్లన్న.... దాటాక బోడి మల్లన్న. ఈ సామెత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కి అచ్చం సరిపోతుందని ఆయన్ని విమర్శించేవారు అనేమాట. ప్రత్యేక రాష్ట్రం కోసం కొట్లడిన ఉద్యమకారులకు చెట్టెక్కించేంత హామీలు ఇవ్వడం, పదవులు పంపిణీ వచ్చేసరికి పక్కనపెట్టేయడం తన నిర్ణయాలను సమర్థించుకోవడంలో కేసీఆర్ దిట్ట అంటుంటారు. తాజాగా 19 ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేసిన కేసీఆర్ నిర్ణయాలతో నష్టపోయిన ఉద్యమకారులు ఆవేదన చెందడం తప్ప కనీసం నోరెత్తి మొత్తుకునే పరిస్థితులు లేనంతగా నియంతృత్వం ఉందనే విమర్శలు వస్తున్నాయి.
చేతికందిన కూడు నోటిదాకరాక ఏడుస్తున్న ఉద్యమకారులు!
ఎమ్మెల్యే కోటాలో అవకాశం ఇస్తామని పిలిచి కొందరిని, స్థానిక కోటాలో నామినేషన్కు రెడీగా ఉండాలని నమ్మించి మరికొందరిని మోసం చేశారని ముఖ్యమంత్రి కేసీఆర్పై అంతర్గతంగా ఇంటాబయట వస్తున్న విమర్శలు. ఉద్యమం కోసం, పార్టీ కోసం ఎంతపోట్లాడినా ఎందుకో ఇప్పుడు పదవుల విషయంలో కేసీఆర్తో వాళ్లు కొట్లాడితేగాని పదవులు దక్కవా అన్నట్లు నష్టపోతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పదవులు ఫలానావారికే వస్తున్నట్లుగా నమ్మేలా లీకులివ్వడం, భవన్కు పిలిపించుకుని కొద్దిసేపు కూర్చోబెట్టుకుని సలామ్ కొట్టించుకోవడంతో ఆశావహులు ఉబ్బితబ్బిబైపోతున్నారు. అంతలోనే చేతికందినకూడు నోటిదాట రాకపోవడంతో ఉద్యమకారులు వెక్కివెక్కి ఏడ్వడం తప్ప మరేమీ చేయలేకపోతున్నారని పార్టీలో ఇన్సైడ్ టాక్ వస్తోంది. నామినేషన్లకు రెడీ అవుతున్న సమయం వరకు కూడా పదవులు వస్తున్నాయనే ఆశతో ఉండేవారికి చివరికి రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గరకి వేరేవాళ్లు చేరుకుని దండలేసుకుంటడంతో ఇదేం రాజకీయం అనే విమర్శలు వస్తున్నాయి.
ఎమ్మెల్యే కోటాలో ఎర్రోళ్ల శ్రీనివాస్కు, లోకల్ కోటాలో గాయకుడు సాయిచంద్కు ఇదే అన్యాయం జరిగిందనే ఆవేదన వారితో పాటు వారు నష్టపోయిన విధానాన్ని చూస్తున్నవారిలో ఉంది. తెలంగాణ జేఏసీ కన్వీనర్గా ఉద్యమంలో కీలకపాత్ర పోశించిన పిట్టల రవీందర్కు ముదిరాజ్ సామాజిక కోటా కింద పెద్దలసభకు పంపిస్తానని గతంలో ఇచ్చిన హామీని కేసీఆర్ ఇప్పటివరకు నెరవేర్చలేదు. జంబో ఎమ్మెల్సీ జాబితా అయిపోవడంతో మరెప్పుడూ పదవులు రావనే భావనలో ఉద్యమకారులు రగిలిపోతున్నారు. బయటపడలేక లోలోన కుమిలిపోతున్నారు.
ఎంపీలు, ఎమ్మెల్యేలుగా ఎదిగిపోతున్న ఎర్రోళ్ల జూనియర్లు
ఏర్రోల్ల శ్రీనివాస్.. తెలంగాణ ఉద్యమంలో కీలక వ్యక్తి. 2009 నుంచే పార్టీలో పోటీ చేసే అవకాశం కేసీఆర్ ఇస్తారని ఆశలు పెట్టుకున్నారు. బాల్క సుమన్ ఇచ్చిన ప్రాధాన్యత ఉద్యమంలో కొట్లడిన ఎర్రోళ్లకు మాత్రం కేసీఆర్ ఇవ్వడం లేదనే టాక్ ఉంది. కొంతకాలం నామినేటెడ్ పోస్ట్ అవకాశం ఇచ్చినా.... అసెంబ్లీలో అడుగు పెట్టాలన్న ఎర్రోళ్ల కోరికను మాత్రం కేసీఆర్ నేరవేర్చడం లేదు. ఆయన కంటే జూనియర్లు ఎంపిలు, ఎమ్మెల్యేలు అయ్యారు..కానీ ఎర్రోళ్లకు అవకాశం దక్కలేదు. ఇటీవల ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో చివరి నిమిషం వరకు ఎర్రోళ్ల కన్ఫాం అని చెప్పి బండ ప్రకాష్, వెంకట్రామిరెడ్డి, పాడి కౌషిక్రెడ్డిలకు అవకాశం ఇచ్చారు.
టీజేఏసీ కన్వీనర్ పిట్టలకు కేసీఆర్ ఇచ్చిన హామీ పిట్ట కథేనా?
తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన పిట్టల రవీందర్ది ఎవరికి చెప్పుకోలేని బాధ. తెలంగాణ జేఏసి కన్వీనర్గా వ్యవహరించిన పిట్టలకు ముదిరాజ్ సామాజికవర్గం తరఫున ఎమ్మెల్యే కోటాలో పెద్దల సభకు పంపిస్తానని గతంలోనే సీఎం నుంచి హామీ వచ్చింది. అయితే చివరి నిమిషంలో ఆ అవకాశాన్ని రాజ్యసభ ఎంపీ బండ ప్రకాష్ ముదిరాజ్కి ఇచ్చి కులం లెక్క లెవల్ చేశారు.దీంతో పిట్టల ఆశలు గల్లంతయ్యాయి.రాజకీయ సమీకరణాల కోసం ఉద్యమ నేతల భవిష్యత్తును కేసీఆర్ ఫణంగా పెడుతున్నారనే ఆవేదనలు వ్యక్తమవుతున్నాయి.
నామినేషన్ టైమ్లో సాయిచంద్కు నమ్మించి మోసం!.."గాయపడి"మూగబోయిన గొంతు
స్థానిక సంస్థల కోటలో అవకాశం దక్కుతుందని కొండంత ఆశ పెట్టుకున్నారు ప్రజా గాయకుడు సాయిచంద్. మహబూబ్నగర్ స్థానిక సంస్థల కోటాలో పెద్దల సభకు పంపేందుకు నిర్ణయం తీసుకుని, నామినేషన్ వేయాలని చెప్పి చివరి నిమిషంలో సాయి చంద్కి కేసీఆర్ షాక్ ఇచ్చారు. ఆయన ప్లేస్లో కూచుకుంట్ల దామోదర్రెడ్డికి అవకాశం ఇచ్చారు. దీంతో చట్టసభలో అడుగు పెట్టాలనుకున్న సాయి చాంద్ ఆశలను గల్లంతు చేశారు కేసీఆర్. పార్టీ ఎన్నికల సభలకు, సమావేశాలకు, ప్రభుత్వ కార్యక్రమాలకు గాయకుడిగా తన ఆట పాటలతో మెప్పించిన సాయిచంద్లో ఆవేదన తప్పడం లేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
నచ్చినవారికోసం ఉద్యమకారులను బలిచేస్తున్న కేసీఆర్!
తనకు నచ్చినవాళ్లకే పదవులు ఇవ్వాలంటే కేసీఆర్..ఉద్యమకారులనే బలి చేయాలా అనే విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే మాజీ మంత్రి ఈటెలను బయటకు పంపి భంగపడ్డ గులాబి బాస్ కేసీఆర్ మరింత ఉద్యమకారులను పొమ్మనలేకపొగపెడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.ఆపరేషన్ ఆకర్ష్గా బీజేపీ మొదటగా టీఆర్ఎస్లోని ఉద్యమకారులకు కాషాయకండువా కప్పేందుకు ఎదురుచూస్తోంది. ఈ తరుణంలో కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయాలు పార్టీకి నష్టం కలిగించేలా ఉన్నాయని ఉద్యమంలో, గులాబీదళంలో కీలకంగా వ్యవహరించి వివిధ కారణాలతో కనమరుగు అవుతున్న నేతల అంతరంగం.