హైదరాబాద్ ప్రశాంతంగా ఉందంటే కేసీఆర్ వల్లే: కేటీఆర్
ABN , First Publish Date - 2020-11-19T17:31:39+05:30 IST
తెలంగాణ రాకముందు హైదరాబాద్లో అనిశ్చితి ఉండేదని రాష్ట్ర మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. ప్రెస్ ది మీట్లో మాట్లాడిన ఆయన.. టీఆర్ఎస్పై ఎన్నో రకాల విషప్రచారాలు చేశారని,
హైదరాబాద్: తెలంగాణ రాకముందు హైదరాబాద్లో అనిశ్చితి ఉండేదని రాష్ట్ర మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. ప్రెస్ ది మీట్లో మాట్లాడిన ఆయన.. టీఆర్ఎస్పై ఎన్నో రకాల విషప్రచారాలు చేశారని, తెలంగాణ వస్తే అంధకారం అవుతుందన్నారు. హైదరాబాద్ ప్రశాంతంగా ఉందంటే కేసీఆర్ వల్లేనని కేటీఆర్ అన్నారు. పెట్టుబడులు రావని ప్రచారం చేశారని, ఇప్పుడు దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తోందన్నారు. మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి పెట్టామని, గతంలో ఎండాకాలం వస్తే జలమండలి ఎదుట ధర్నాలు జరిగేవని, శివారు ప్రాంతాలకు నీళ్లు ఇచ్చిన ఘనత కేసీఆర్దేనన్నారు. తాగునీటి కోసం యుద్ధాలు చేసే పరిస్థితి లేదని, మెట్రో నగరాల్లో పారిశుద్ధ్య నిర్వహణలో హైదరాబాద్ ముందుందన్నారు.
త్వరలో హైదరాబాద్లో రెండు చెత్త డంపింగ్ యార్డులు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. దక్షిణ భారతదేశంలోనే తొలి వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ను ఏర్పాటు చేశామన్నారు. హైదరాబాద్లో 3,200 స్వచ్ఛ ఆటోలు పనిచేస్తున్నాయని, గతంలో వారానికి 2 రోజులు పవర్ హాలిడేలు ఉండేవని గుర్తు చేశారు. ఇప్పుడు పరిశ్రమలకు 24 గంటల కరెంట్ ఇస్తున్నామన్నారు. హైదరాబాద్లో పేకాట క్లబ్లు లేవు, గుడుంబా గబ్బులు లేవని తెలిపారు. నిర్మాణ రంగం వ్యర్థాల కోసం ప్రత్యేక ప్లాంట్ ఏర్పాటు చేశామన్నారు. పోకిరీలు, ఆకతాయిల ఆగడాలకు అడ్డుకట్ట పడిందని కేటీఆర్ అన్నారు.
కేసీఆర్ ఉద్యమ నాయకుడిగా పదవీ బాధ్యతలు చేపట్టకముందు.. ఎన్నో విమర్శలు చేసినా... అసాధారణ పరిణతి చూపించారని కేటీఆర్ అన్నారు. జూన్ 2న 2014లో బాధ్యతలు తీసుకున్న తర్వాత కనీస అవసరాలు, మౌలిక వసతులు, ప్రాథమిక అవసరాల దృష్టిలో పెట్టుకుని పని చేశామన్నారు.