ఏం చేస్తున్నారు.. రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసిన హైకోర్టు

ABN , First Publish Date - 2021-04-23T20:29:32+05:30 IST

తెలంగాణలో కరోనా పరిస్థితులపై రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు నిలదీసింది. శుక్రవారం హైకోర్టులో జరిగిన విచారణకు హెల్త్ సెక్రటరీ రిజ్వీ హాజరయ్యారు.

ఏం చేస్తున్నారు.. రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసిన హైకోర్టు

హైదరాబాద్: తెలంగాణలో కరోనా పరిస్థితులపై రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు నిలదీసింది. శుక్రవారం హైకోర్టులో జరిగిన విచారణకు హెల్త్ సెక్రటరీ రిజ్వీ హాజరయ్యారు. నైట్ కర్ఫ్యూ వల్ల కరోనా కేసులు తగ్గాయని ప్రభుత్వం పేర్కొనగా... ఎక్కడ తగ్గాయో చూపించాలని హైకోర్టు వ్యాఖ్యానించింది. ‘‘బార్లు, థియేటర్ల వద్ద ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? కుంభమేళాకు వెళ్లొచ్చిన వారిని.. ఇతర రాష్ట్రాలు క్వారంటైన్‌లో పెడుతున్నాయి. తెలంగాణలో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఆర్టీపీసీఆర్‌ రిపోర్ట్‌ ఎందుకు 24 గంటల్లో ఇవ్వట్లేదు? వీఐపీలకు మాత్రమే 24 గంటల్లో రిపోర్ట్‌ ఇస్తున్నారు. శ్మశానవాటికల్లో రోజుకు ఎంతమందికి.. అంత్యక్రియలు చేస్తున్నారో వివరాలు ఇవ్వండి. రెమిడెసివిర్‌ ఇంజెక్షన్‌ రాష్ట్రంలోనే తయారు చేస్తున్నా.. ప్రజలకు అందుబాటులో లేవు. ప్రతి ఆస్పత్రిలో డిస్‌ప్లే బోర్డులు ఎందుకు ఏర్పాటు చేయట్లేదు? రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని కొవిడ్ సెంటర్లు ఏర్పాటు చేశారు? వలస కార్మికుల కోసం ఏం చర్యలు తీసుకుంటున్నారు? 108 అంబులెన్స్‌లు రాష్ట్రంలో ఎన్ని ఉన్నాయి? ఎన్నికల ర్యాలీలు, సభలను ఎందుకు నియంత్రించడంలేదు?’’ అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది. 


ప్రభుత్వం చెప్పిన వివరణపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ‘‘ఆక్సిజన్‌ కొరత ఉందని ఆరోగ్యశాఖ మంత్రి ఈటల చెబుతున్నారు. గతంలో కోర్టుకు ఇచ్చిన నివేదికలో సరిపడా ఆక్సిజన్‌ ఉందన్నారు. ఇందులో ఎవరిది నిజమని నమ్మాలి? ప్రతి రోజు 384 టన్నులకు 270 టన్నులు మాత్రమే ఆక్సిజన్‌ ఉందని ప్రభుత్వం తెలపగా... 3 రోజుల్లోనే ఆక్సిజన్ నిల్వల కొరత ఎలా ఏర్పడింది? సీఎం కేసీఆర్‌తో సహా అధికారులు కొవిడ్‌ బారిన పడ్డారు. అయినా చర్యలు శూన్యం. రాష్ట్రంలో థియేటర్లు, బార్లను ఎందుకు నియంత్రించడం లేదు?’’ అంటూ తదుపరి విచారణను మధ్యాహ్నానికి వాయిదా వేసింది. 

Updated Date - 2021-04-23T20:29:32+05:30 IST