Kaleswaram Project: కాళేశ్వరం పేరెత్తితే 3 జిల్లాల్లో మంట

ABN , First Publish Date - 2022-09-09T23:00:22+05:30 IST

కాళేశ్వరం ప్రాజెక్ట్ (Kaleshwaram Project) పేరు ఎత్తితే మాత్రం.. మూడు జిల్లాల రైతులు...

Kaleswaram Project: కాళేశ్వరం పేరెత్తితే 3 జిల్లాల్లో మంట

భూపాలపల్లి (Bhupalpally): కాళేశ్వరం ప్రాజెక్ట్ (Kaleshwaram Project) పేరు ఎత్తితే మాత్రం.. మూడు జిల్లాల రైతులు (Farmers) తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. వేలాది ఎకరాల పంటలే కాదు.. ఇళ్ళు కూడా నీట మునగడానికి కాళేశ్వరమే కారణమన్న అభిప్రాయం.. ఆయా జిల్లాల ప్రజల్లో నాటుకు పోతోంది. ప్రాజెక్ట్ గురించి ఆహా.. ఓహో అంటున్న టీఆర్ఎస్ (Trs) నేతలు.. తీవ్రంగా నష్ట పోతున్నా.. కనీస పరిహారం ఎందుకు ఇప్పించడం లేదని ముంపు బాధితులు ప్రశ్నిస్తున్నారు. 


ముఖ్యంగా మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్​భూపాలపల్లి జిల్లాల రైతాంగానికి బ్యాక్ వాటర్ శాపంగా మారింది.  బ్యాక్​వాటర్‌తో మాత్రం ఆయా జిల్లాల్లోని 60 వేల ఎకరాల్లో పంటలు మునుగుతున్నాయి. నాలుగేళ్లుగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల బ్యాక్​వాటర్‌తో గోదావరి (Godavari) పరివాహకంలోని వేలాది ఎకరాల పంటలు మునిగిపోతున్నాయి. పంటలతో పాటు ఇళ్ళు కూడా నీట మునిగాయి. దీనంతటికీ ఎగువ నుంచి వచ్చిన వరద కారణమని బాధితులు నెత్తి నోరు బాదుకుంటున్నారు. గతంలో గోదావరికి ఎంత పెద్ద వరదలు వచ్చినా ఎలాంటి ముంపు ఉండేది కాదని, కాళేశ్వరంతో వరదలొచ్చిన ప్రతిసారీ వేలాది ఎకరాల్లో పంటలను కోల్పోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయినా టీ.సర్కార్‌ నుంచి ఎలాంటి భరోసా ప్రకటన రాకపోవడంతో రైతులంతా తీవ్ర ఆవేదనతో రగిలిపోతున్నారు. 


కాళేశ్వరం ప్రాజెక్టు మనుగడలోకి వచ్చిన ఏడాది నుంచి ముంపు సమస్య వెంటాడుతోంది. జూలైలో వచ్చిన వరదలకు నష్టం మరింత రెట్టింపు అయింది. రామగుండం-మంచిర్యాల జిల్లా కేంద్రాలతో పాటు మంథని సహా అనేక గ్రామాలకు వరద పోటెత్తింది. ఎల్లంపల్లి, దిగువన సుందిళ్ళ, అన్నారం బ్యారేజీలతో పాటు ఇతర వాగులు పొంగడంతో ముంపు నష్టం పెరిగింది. కట్టు బట్టలు తప్ప ఏమీ మిగల్లేదు. ఒక్కో కుటుంబం లక్షల్లో నష్ట పోయింది. వేల మంది నిరాశ్రయులయ్యారు. ఇప్పటికీ.. ఇంకా కోలుకోలేదు. అనేక సమస్యలపై మాట్లాడే కేసీఆర్.. ముంపు సమస్యను ఎందుకు పట్టించుకోవడం లేదని విపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 


ఇదిలావుంటే... ముంపు బాధితులు ఎంత మొత్తుకుంటున్నా తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) స్పందించకపోవడం.. సిట్టింగ్ టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలకు ముప్పుగా మారుతోంది. అయితే పలువురు ఎమ్మెల్యేలు సమస్యను ప్రతి ఏటా సీఎం కేసీఆర్ (Cm Kcr) దృష్టికి తీసుకెళుతున్నారట. భూ సేకరణ జరపాలని, లేని పక్షంలో తక్షణ సాయంగా పంట నష్ట పరిహారం చెల్లించాలని కోరుతున్నారట. ఇక.. ప్రజల నుంచి ఒత్తిడి పెరుగుతుండడంతో పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్టా మధు (Peddapalli Zp Chairman Putta Madhu) కొద్దిరోజుల క్రితం ముఖ్యమంత్రికి లేఖ రాశారట. సమస్యను పరిష్కరించాలని ప్రజాప్రతినిధులు విజ్ఞప్తి చేయగా సీఎం కేసీఆర్ సున్నితంగా తిరస్కరించారట. ఇప్పుడు భూ సేకరణకు అవసరమైన నిధులు లేవని.. అలా అని పరిహారం చెల్లించడం ప్రారంభిస్తే తెలంగాణ వ్యాప్తంగా పంటలు నష్టపోయిన అందరికి చెల్లించాల్సి వస్తుందని.. అది ప్రభుత్వానికి భారమవుతుందని తేల్చి చెప్పారట. 


మొత్తానికి.. కాళేశ్వరం గురించి తెలంగాణ ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్నా క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి దారుణంగా ఉన్నట్లు అర్థమవుతోంది. ముంపు ప్రాంతాల్లో టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు తిరగలేని దుస్థితి నెలకొనడంతో రాజకీయంగా ఆ పార్టీకి తీవ్ర నష్టం జరిగే అవకాశం కనిపిస్తోంది. బాధితుల ఆందోళన నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఆయా జిల్లాల్లో ఏం జరుగుతుందో చూడాలి మరి.




Updated Date - 2022-09-09T23:00:22+05:30 IST