Governor Tamilisai: నిమ్స్ డైరెక్టర్పై ఆంధ్రజ్యోతి కథనం.. గవర్నర్ తమిళిసై రియాక్షన్..
ABN , First Publish Date - 2022-09-08T23:57:50+05:30 IST
వాస్తవాలను ప్రతిబించడంలో ఆంధ్రజ్యోతి మరోసారి తన నిబద్ధతను చాటుకుంది. అమాత్యులైనంత మాత్రాన చూసీచూడనట్టుగా..
హైదరాబాద్: ప్రతిష్టాత్మకమని ప్రభుత్వం ప్రకటించుకునే పెద్దాసుపత్రి డైరెక్టరే చికిత్స కోసం ప్రైవేటు ఆస్పత్రికి పరుగులు తీయడం ఏమిటని గవర్నర్ తమిళిసై అన్నారు. తెలంగాణా గవర్నర్గా తన పదవీ కాలం మూడేళ్లు పూర్తయిన సందర్భంగా రాజ్ భవన్లో గురువారం ఏర్పాటు చేసిన పత్రికా ప్రతినిధుల సమావేశంలో పలు అంశాల మీద ఆమె మాట్లాడారు. నిమ్స్ డైరక్టర్ అపోలోలో చికిత్స నిమిత్తం చేరిన విషయాన్ని ఆంధ్రజ్యోతి వెలుగులోకి తెచ్చిన విషయం తెలిసిందే. నిమ్స్కి తలవంపులు తెచ్చిన ఈ ఘటనపై ఆంధ్రజ్యోతి ఫోకస్ చేసిన అంశాలు గవర్నర్ మాటల్లో ప్రస్తావనకి రావడం విశేషం. నిమ్స్ డైరక్టర్ కార్పోరేట్ ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నారంటే.. ప్రభుత్వ ఆస్పత్రులు ఎంత అధ్వాన్న పరిస్థితుల్లో ఉన్నాయో అర్థమవుతోందని ఆమె వ్యాఖ్యానించారు.
నిమ్స్ ఆస్పత్రి డైరెక్టర్ మనోహర్ గుండెపోటుకు గురవడంతో ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందిన అంశాన్ని గవర్నర్ ప్రస్తావించారు. నిమ్స్ ఆసుపత్రి డైరెక్టర్ మనోహర్ గుండె సంబంధ సమస్యతో హైదర్గూడలోని అపోలోలో చికిత్స నిమిత్తం చేరిన విషయాన్ని, నిమ్స్ డైరెక్టర్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల నిమ్స్ ఉద్యోగుల్లో ఆగ్రహం, అసంతృప్తి వ్యక్తమైందన్న అంశాన్ని తొలుత వెలుగులోకి తీసుకొచ్చింది ఆంధ్రజ్యోతి కావడమే విశేషం.
నిమ్స్లో మెరుగైన వైద్యం అందుతుందని భావించే వారికి నిమ్స్ డైరెక్టర్ అపోలోలో చేరారనే విషయం తెలిస్తే తమను బయట ఎంత చిన్నచూపు చూస్తారనే ప్రశ్నను నిమ్స్ ఉద్యోగులు ప్రధానంగా లేవనెత్తారనే విషయాన్ని ఆంధ్రజ్యోతి కథనంలో ప్రముఖంగా ప్రస్తావించడం జరిగింది. కేన్సర్ చికిత్సలకు కొత్త పరికరాలు, రోబోటిక్ సర్జరీలు ఇలా అధునాతన వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్న నిమ్స్లో వైద్యం పొందేందుకు నిమ్స్ డైరెక్టరే ముందుకు రాకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్న విషయాన్ని కూడా ఆంధ్రజ్యోతి బయటపెట్టింది. ఆంధ్రజ్యోతి ఎక్స్క్లూజివ్గా ప్రత్యేక కథనంతో వెలుగులోకి తీసుకొచ్చిన ‘నిమ్స్ డైరెక్టర్ మనోహర్ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిక’ విషయాన్ని గవర్నర్ తమిళిసై ప్రస్తావించడం గమనార్హం. నిమ్స్ డైరెక్టర్కు అదే నిమ్స్ వైద్యంపై నమ్మకం లేక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారనే విషయం విమర్శలకు తావిచ్చింది.