తెలంగాణ INTER ఫలితాలు విడుదల
ABN , First Publish Date - 2022-06-28T16:46:33+05:30 IST
తెలంగాణలో ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. మంగళవారం ఉదయం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలను విడుదల చేశారు.
హైదరాబాద్: తెలంగాణలో ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. మంగళవారం ఉదయం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను విడుదల చేశారు. మొత్తం 9 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఇంటర్ ఫలితాల్లో ఈసారి కూడా అమ్మాయిలదే పైచేయిగా నిలిచింది. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 63.32 శాతం మంది, ద్వితీయ సంవత్సరంలో 67.16 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఆగష్టు 1న ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగనున్నాయి. ఆగస్టు చివరినాటికి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నాయి. ఇక ఈనెల 30 నుంచి సప్లిమెంటరీ ఫీజు చెల్లింపునకు అవకాశం కల్పించారు. ఫలితాలను https://tsbie.cgg.gov.in, https://results.cgg.gov.in, https://examresults.ts.nic.in అనే వెబ్సైట్లో విద్యార్థులు చూడవచ్చని అధికారులు ప్రకటించారు.
ఇంటర్ ఫస్టియర్ ఫలితాల్లో మేడ్చల్ జిల్లా 76 శాతం ఉత్తీర్ణతతో మొదటి స్థానంలో నిలువగా.. సెకండియర్లో కూడా ఇదే జిల్లా 78 శాతం ఉత్తీర్ణతతో ప్రథమ స్థానంలో నిలిచాయి. ఇక అత్యల్పంగా ఫస్టియర్లో 40 శాతం ఉత్తీర్ణతతో మెదక్ జిల్లా నిలువగా.. సెకండియర్లో కూడా ఇదే జిల్లా 47 శాతం ఉత్తీర్ణతతో లాస్ట్లో నిలిచాయి. ఫస్టియర్లో అమ్మాయిలు 72.33 శాతం, అబ్బాయిలు 54.25 శాతం ఉత్తీర్ణత సాధించగా.. ఇక సెకండియర్లో అమ్మాయిలు 75.28 శాతం, అబ్బాయిలు 59.21 శాతం ఉత్తీర్ణత సాధించారు.