సంక్షేమంలో దేశంలోనే ముందున్న తెలంగాణ
ABN , First Publish Date - 2022-09-24T05:59:10+05:30 IST
సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల అమలులో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ముందున్నదని వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ అన్నారు.
ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ బాబు
వేములవాడ, సెప్టెంబరు 23 : సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల అమలులో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ముందున్నదని వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ అన్నారు. వేములవాడ పట్టణంలోని మహాలింగేశ్వర గార్డెన్లో శుక్రవారం బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓర్వలేని కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణికి పాల్పడుతున్నదని ఆరోపించారు. ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఎనిమిది సంవత్సరాలలోనే ఎనలేని ప్రగతిని సాధ్యం చేసి సామాన్యులకు సైతం సంక్షేమ పథకాలను అందించారన్నారు. విద్య, వైద్యం, సాగు, తాగునీరు వంటి అనేక సంక్షేమ పథకాలను అందిస్తున్నామన్నారు. రాష్ట్రంలో 45 లక్షల మందికి ఆసరా పెన్షన్లు అందుతున్నాయన్నారు. అర్హులైన ప్రతీ ఒక్కరికి ఆసరా పింఛన్ అందజేస్తామన్నారు. మంత్రి కేటీఆర్ సారథ్యంలో వేములవాడ అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తోందన్నారు. కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చేస్తున్నామని, ఇటీవల 14 కోట్ల నిధులు కూడా మంజూరు చేశామని గుర్తు చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి రాజు, మున్సిపల్ కమిషనర్ శ్యాంసుందర్రావు, మేనేజర్ సంపత్రెడ్డి, టౌన్ ప్లానింగ్ అధికారి శ్రీధర్, ఏఈ నర్సింహస్వామి, సింగిల్ విండో ఛైర్మన్ ఏనుగు తిరుపతిరెడ్డి, కౌన్సిలర్లు నిమ్మశెట్టి విజయ్, గోలి మహేష్, యాచమనేని శ్రీనివాసరావు, మారం కుమార్, నరాల శేఖర్, ఇప్పపూల అజయ్, సిరిగిరి రామచందర్, జోగిని శంకర్, రెండుమిద్దెల జయ, కందుల శ్రీలత, పట్టణ టీఆర్ఎస్ అధ్యక్షుడు పుల్కం రాజు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గోస్కుల రవి, నాయకులు రామతీర్ధపు రాజు, పొలాస నరేందర్, గడ్డం హన్మండ్లు, గుడూరి మధు తదితరులు ఉన్నారు.