
- మహిళల రక్షణ కోసం పటిష్ఠ చర్యలు
- ఆర్థిక స్వావలంబన కోసం అనేక కార్యక్రమాలు: ఎమ్మెల్సీ కవిత
హైదరాబాద్ సిటీ, మే 16 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో మహిళలకు అన్ని రంగాల్లో అగ్రపీఠం వేస్తున్నామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చెప్పారు. రాష్ట్ర మహిళలు ఎక్కడ వేధింపులు ఎదురైనా ధైర్యంగా ఫిర్యాదు చేస్తారని, మహిళల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం పటిష్ఠ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ‘సామాజిక మాధ్యమాల్లో మహిళలు - వేధింపులపై గళమెత్తడం’ అనే అంశంపై సోమవారం హైదరాబాద్లో ఓ సంస్థ నిర్వహించిన జాతీయ స్థాయి అవగాహన కార్యక్రమంలో కవిత పాల్గొని మాట్లాడారు. సైబర్ వేధింపులపై ఫిర్యాదు చేస్తే మహిళలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని చెప్పారు. మహిళల రక్షణతో పాటు, ఆర్థిక స్వావలంబన కోసం సీఎం కేసీఆర్ ఎన్నో కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాల్లో మహిళలకు ప్రాధాన్యం ఇస్తూ వారి పేరు మీదనే లబ్ధి చేకూరుస్తున్నామని పేర్కొన్నారు.
ఇటీవల ఓ యువతి విద్యుత్ శాఖలో జూనియర్ లైన్మన్గా నియామకం అయిందని చెప్పారు. రాష్ట్రంలో మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, గ్రామీణ ప్రాంతాల్లో సైతం ఇంటర్నెట్ మరింతగా అందుబాటులోకి వస్తే మహిళల ఆర్థిక అవకాశాలు పెరుగుతాయన్నారు. గ్రామాల్లో ఉపాధి కోసం బీడీలు చుడుతున్న మహిళలు ల్యాప్టా్పలో పనిచేసే రోజులు రావాలని ఆకాంక్షించారు. మహిళల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల్లో షీ టీంలు ఏర్పాటు చేయటంతో పాటు మహిళా పోలీసు స్టేషన్లు, స్పెషల్ సైబర్ సెల్ను సైతం అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. మహిళలకు సోషల్ మీడియాలో వేధింపులు ఎదురైతే, వాటిని తొలగించకుండా, ఆధారాలతో వేధించిన వారి మీద ఫిర్యాదు చేయాలని, దాంతో తక్షణమే కఠిన చర్యలు తీసుకునే అవకాశం లభిస్తుందని ఆమె అన్నారు.