భారీగా తెలంగాణ మద్యం స్వాధీనం
ABN , First Publish Date - 2021-03-09T05:56:47+05:30 IST
పట్టణ శివారు వినుకొండరోడ్డులోని పెరల్స్ కల్యాణ మండపం వద్ద సోమవారం తెలంగాణకు చెందిన అక్రమ మద్యాన్ని నరసరావుపేట స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
నరసరావుపేట లీగల్, మార్చి 8: పట్టణ శివారు వినుకొండరోడ్డులోని పెరల్స్ కల్యాణ మండపం వద్ద సోమవారం తెలంగాణకు చెందిన అక్రమ మద్యాన్ని నరసరావుపేట స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముందస్తు సమాచారంతో అక్కడ మాటువేసి మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఈబీ సీఐ కసుకుర్తి కర్ణ విలేకర్లకు తెలిపారు. వినుకొండ రోడ్డులో ఏపీ 07టీఎం 7337 అనే వాహనాన్ని తనిఖీ చేయగా సుమారు రూ.10 లక్షలు విలువైన 4464 తెలంగాణ మద్యం గుర్తించి స్వాధీనం చేసుకున్నామన్నారు. 12 టైర్ల లారీ యజమాని గోపవరపు ఆంజనేయులు, డ్రైవర్ బుడిగపాక నగేష్లను అరెస్టు చేశామన్నారు. స్వాధీనం చేసుకున్న సొత్తు విలువ రూ.51 లక్షలు ఉంటుందన్నారు. ఈ కేసులో కీలక పాత్రధారి పట్టణానికి చెందిన షేక్ మహమ్మద్, ఇతడికి సహాయకుడైన గుంటూరుకు చెందిన మల్లీలు పరారీలో ఉన్నారన్నారు. ఆంజనేయులు, నగేష్లను రిమాండ్ తరలిస్తూ న్యాయమూర్తి యూ మాఽధురి ఉత్తర్వులు జారీ చేశారని సీఐ తెలిపారు.
బెల్లం ఊట ధ్వంసం
బొల్లాపల్లి: మండలంలోని కనమలచెరువు శివారు బ్రిడ్జి తండా అటవీ సమీపంలో 58 రమ్ముల్లో నిల్వ చేసిన 12 వేల లీటర్ల బెల్లపు ఊటను ఎస్ఐ అనీల్ కుమార్, సిబ్బంది ధ్వంసం చేశారు. నిందితుల కోసం గాలిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.