TS News.. బీజేపీ మునుగోడులో మునగడం ఖాయం: టీఆర్ఎస్ ఎంపీ
ABN , First Publish Date - 2022-09-21T21:55:55+05:30 IST
టీఆర్ఎస్ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
హైదరాబాద్ (Hyderabad): టీఆర్ఎస్ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ (Badugala Lingaiah Yadav), తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay)పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ బండి సంజయ్ నీచంగా మాట్లాడటాన్ని ఖండిస్తున్నామన్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా మాట్లాడుతున్నారని, తెలంగాణలో ఏ స్కీమ్లు లేవని మూర్ఖుడిలా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బండి సంజయ్కు దమ్ముంటే ప్రధాని మోదీ (PM Modi)ని ఒప్పించి దళిత బంధు అమలు చేయించాలని సవాల్ చేశారు. మోటార్లకు మీటర్లు పెడితే ప్రజలు దేశం నుంచి బీజేపీని తరిమి కొడతారన్నారు. మోదీది ప్రజా వ్యతిరేక పాలన అని విమర్శించారు. తెలంగాణపై మోదీ ప్రభుత్వం మిడతల దండులా పడిందన్నారు. రాజగోపాల్ రెడ్డి (Rajagopal reddy) స్వార్థ ప్రయోజనాల కోసం ఎన్నికలు తెస్తున్నారని ఆరోపించారు. బీజేపీ మునుగోడులో మునగడం ఖాయమన్నారు.
టీఆర్ఎస్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ (MLA Metuku Anand) మాట్లాడుతూ... తెలంగాణలో అమలవుతున్న పథకాల మీద చర్చ పెడతామని, ఎవరు ఏ పథకాలు అమలు చేస్తున్నారో ప్రజలే చెబుతారన్నారు. ప్రతిపక్ష పాత్ర కూడా పోషించలేమని భావించే ఇష్టా రాజ్యాంగ మాట్లాడుతున్నారని, ఇకనైనా బండి సంజయ్ తన మాటలు బంద్ చేయాలని ఆనంద్ అన్నారు.