ఉత్తుత్తి కంపెనీకి రూ. 3 కోట్ల రుణాలు

ABN , First Publish Date - 2022-08-10T13:34:06+05:30 IST

ఉత్తుత్తి కంపెనీకి రూ. 3 కోట్ల రుణాలు

ఉత్తుత్తి కంపెనీకి రూ. 3 కోట్ల రుణాలు

బ్యాంకును బురిడీ కొట్టించిన కేటుగాళ్లు


హైదరాబాద్‌ సిటీ: చిల్లర దొంగతనాలతో పని కాదని భావించిన కేటుగాళ్లు బ్యాంకునే టార్గెట్‌ చేశారు. ఓ కంపెనీని సృష్టించి రుణాల పేరుతో రూ. 3 కోట్లు తీసుకుని ఉడాయించారు. రంగంలోకి దిగిన రాచకొండ పోలీసులు నిందితుల ముఠా ఆటకట్టించారు. 

అధికారులను 


మేనేజ్‌ చేసి..

బ్యాంకును మోసం చేసి రూ. కోట్లు కొల్లగొట్టాలని భావించిన కేటుగాళ్లు.. నాచారం పరిధి మల్లాపూర్‌లో ఓ కంపెనీ ఏర్పాటు చేసినట్లు పత్రాలు సృష్టించారు. కంపెనీలో పలు ఉద్యోగాలూ సృష్టించారు. తెలిసిన కొంతమంది వ్యాపారుల, రైతుల, నిరుద్యోగుల ఆధార్‌ కార్డులు, ఇతర వివరాలు సేకరించి ఉద్యోగులుగా చిత్రీకరించారు. వారి పేరు, హోదాలతో బ్యాంకు అధికారులను మేనేజ్‌ చేసి వేతనాల ఖాతాలు తీశారు. ఆయా ఖాతాల్లో ప్రతి నెలా జీతాల రూపంలో డబ్బులు వేసి, వాటిని తిరిగి వారే డ్రా చేసేవారు. కొద్దిరోజులు గడిచాక బ్యాంకు సిబ్బంది సహకారంతో ఉద్యోగుల పేరుతో క్రెడిట్‌ కార్డులు పొందారు. ఆ తర్వాత రుణాలు మంజూరు చేసే అధికారులను మేనేజ్‌ చేసి వ్యక్తిగత కంపెనీ పేరుతో రుణాలు పొందారు. ఇలా మొత్తం రూ. 3 కోట్ల వరకు తీసుకున్నారు. వాయిదాలు చెల్లించకపోవడంతో బ్యాంకు ఉన్నతాధికారులకు అనుమానం వచ్చి ఆరా తీశారు. కేటుగాళ్లు సమర్పించిన ధ్రువపత్రాల్లో ఉన్న కంపెనీ చిరునామాకు వెళ్లి కంగుతిన్నారు. అక్కడ కంపెనీయే లేదు. దీంతో బ్యాంకు అధికారులు నాచారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మల్కాజిగిరి ఎస్‌వోటి పోలీసులు నిందితుల కోసం గాలించి పట్టుకున్నట్లు తెలిసింది. నేడో, రేపో నిందితులను మీడియా ముందు ప్రవేశ పెట్టే అవకాశం ఉంది. 

Updated Date - 2022-08-10T13:34:06+05:30 IST