తను లేని లోకంలో ఉండలేనని..

ABN , First Publish Date - 2022-08-18T14:44:30+05:30 IST

తను లేని లోకంలో ఉండలేనని..

తను లేని లోకంలో ఉండలేనని..

పెళ్లికి దారితీసిన ఫేస్‌బుక్‌ పరిచయం 

తల్లిదండ్రులు మందలించడంతో యువతి ఆత్మహత్య

రెండు రోజుల అనంతరం యువకుడు కూడా..

విషాదాంతంగా ముగిసిన ప్రేమ


సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌: వారిద్దరూ మైనర్లు. ఫేస్‌బుక్‌ వేదికగా పరిచయం ఏర్పడింది. ప్రేమ చిగురించింది. ఇటీవల పెళ్లి కూడా చేసుకున్నారు. తల్లిదండ్రులు విడదీయడంతో రెండు రోజుల వ్యవధిలో ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. సికింద్రాబాద్‌ రైల్వే హెడ్‌ కానిస్టేబుల్‌ పండరీ కథనం ప్రకారం.. నేరేడ్‌మెట్‌కు చెందిన శ్రీకాంత్‌, రాజేంద్రనగర్‌కు చెందిన నిఖిత ఫేస్‌బుక్‌ స్నేహితులు. రెండేళ్ల పాటు సాగిన స్నేహం ప్రేమగా మారింది. పెళ్లికి పెద్దలు ఒప్పుకోరని ఈ ఏడాది జూన్‌లో రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. పెళ్లి గురించి తెలుసుకున్న అమ్మాయి తల్లిదండ్రులు తమ కుమార్తె మైనర్‌ అని, పెళ్లి చెల్లదని రాజేంద్రనగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు శ్రీకాంత్‌ ఇంటికి వచ్చి దర్యాప్తు చేశారు. మైనర్లు అని గుర్తించిన పోలీసులు, నిఖితను ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు. తమ ప్రేమ వ్యవహారం పోలీస్‌ స్టేషన్‌కు చేరడం, తల్లిదండ్రులు మందలించడంతో తీవ్ర మనో వేదనకు గురైన నిఖిత ఈ నెల 15న రాజేంద్రనగర్‌లో ఉరి వేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిన శ్రీకాంత్‌ మనస్తాపం చెందాడు. ఆమెలేని లోకంలో తానుండలేనని తలచి బుధవారం అమ్ముగూడ రైల్వే స్టేషన్‌ వద్ద రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే పోలీసులు మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. 

Updated Date - 2022-08-18T14:44:30+05:30 IST