తెలంగాణపై కేంద్రం కక్ష సాధింపు: శ్రీనివాస్‌గౌడ్‌

ABN , First Publish Date - 2021-12-26T23:58:43+05:30 IST

తెలంగాణ రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ దుయ్యబట్టారు.

తెలంగాణపై కేంద్రం కక్ష సాధింపు: శ్రీనివాస్‌గౌడ్‌

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ దుయ్యబట్టారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం అంచలంచెలుగా అభివృద్ధి చెందుతుంటే ఓర్వలేక బీజేపీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ బంగారు తెలంగాణగా మార్చేందుకు సీఎం కేసీఆర్‌ ప్రయత్నిస్తుంటే... విద్యార్థులు, యువతను బీజేపీ ప్రలోభాలకు గురిచేస్తూ పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ తలపెట్టిన నిరుద్యోగ దీక్ష బూటకమని విమర్శించారు.


కేంద్రప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఎన్ని లక్షల ఉద్యోగాలు కల్పించిందో చెప్పాలని ప్రశ్నించారు. దేశంలో ఎన్నడూ లేని విధంగా నిరుద్యోగుల శాతం పెరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రప్రభుత్వం అన్ని రంగాలను ప్రైవేటీకరణ చేస్తూ ఉద్యోగ అవకాశాలు లేకుండా చేస్తోందని విమర్శించారు. కేంద్రప్రభుత్వంలో లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా భర్తీ చేయలేదని అన్నారు. కరోనా సంక్షోభ సమయంలో 20 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీ అంటూ ప్రజలను మభ్యపెట్టి ఒక్క రూపాయి కూడా సహాయం చేయలేదన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారాలు చేస్తే సహించేది లేదని శ్రీనివాస్‌గౌడ్‌ హెచ్చరించారు. 

Updated Date - 2021-12-26T23:58:43+05:30 IST