CM KCR: దేశానికే తెలంగాణ రాష్ట్రం ఆదర్శం
ABN , First Publish Date - 2022-10-02T03:08:27+05:30 IST
తెలంగాణ రాష్ట్రం అనేక రంగాల్లో దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా చెప్పుకునే ముంబయి
ఓరుగల్లు: ‘తెలంగాణ రాష్ట్రం అనేక రంగాల్లో దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా చెప్పుకునే ముంబయి నగరం రాజధానిగా ఉన్న మహారాష్ట్ర కన్నా తలసరి ఆదాయం, జీఎస్డీపీ పెరుగుదల, తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది. పరిశుభ్రత.. పచ్చదనం.. చెట్లు పెంచడం.. ఇట్లా.. ఏ రంగంలో చూసినా అగ్రస్థానంలో ఉన్నాం’ అని సీఎం కేసీఆర్ వివరించారు. శనివారం హనుమకొండ జిల్లాలో ప్రతిమ రిలీఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వైద్య కళాశాల, ప్రతిమ కాన్సర్ ఆస్పత్రిని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. నవీన సమాచార విప్లవం ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న నేపథ్యంలో అద్భుతమైన విజ్ఞానాన్ని సముపార్జించే పరిస్థితుల్లో మనం ఉన్నామన్నారు.
తెలంగాణ రాష్ట్రం అద్భుతమైన విజయాన్ని సాధించడమే కాకుండా, అనేక రంగాల్లో అగ్రస్థానంలో నిలుస్తోందన్నారు. రాజకీయాల కోసం కేంద్ర మంత్రులు ఇక్కడికి వచ్చి తిడుతున్నారు... ఢిల్లీలో అవార్డులు ఇస్తున్నారన్నారు. ఉద్యమ సందర్భంలో ప్రజలకు తాను చెప్పింది వందకు వంద శాతం సాకారం అవుతోందన్నారు. తెలంగాణలో ప్రతిఫలిస్తున్న అద్భుతమైన చైతన్యం, సహకరిస్తున్న స్థానిక సంస్థల ప్రతినిధులు, ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేస్తున్న మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధికారుల వల్లే ఇది సాధ్యమైందని కేసీఆర్ వివరించారు.