టీఆర్‌ఎస్‌కు జిల్లా సారథులు.. పదవుల కోసం రగిలిపోతున్న నేతలు..

ABN , First Publish Date - 2022-01-27T17:47:45+05:30 IST

క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ నడుం బిగించారు.

టీఆర్‌ఎస్‌కు జిల్లా సారథులు.. పదవుల కోసం రగిలిపోతున్న నేతలు..

హైదరాబాద్: క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ నడుం బిగించారు. సుదీర్ఘకాలం... తర్జన భర్జనల తర్వాత ఎట్టకేలకు జిల్లాలకు పార్టీ అధ్యక్షులను నియమించారు. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలకు అధ్యక్ష బాధ్యతలు అప్పగించడంతో చాలా కాలంగా పదవులకోసం ఎదురు చూస్తున్న నేతలు అసంతృప్తితో రగిలిపోతున్నారు.


ఎన్నికలే టార్గెట్‌గా సీఎం కేసీఆర్ పార్టీ నిర్మాణం చేపట్టారు. ఇప్పటికే గ్రామ, మండల కమిటీల నిర్మాణం పూర్తి చేసిన గులాబి దళపతి.. ఇప్పుడు జిల్లా అధ్యక్షులను ప్రకటించారు. 33 జిల్లాలకుగానూ 19 జిల్లాలకు ఎమ్మెల్యేలను, 3 జిల్లాలకు ఎంపీలను, 2 జిల్లాలకు ఎమ్మెల్సీలు, 3 జిల్లాలకు జడ్పీ ఛైర్మన్లకు జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు.


టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుల నియామకం కూర్పుపై పార్టీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఒక ప్రణాళిక ప్రకారమే సీఎం కేసీఆర్‌ ఈ నియామకాలు చేపట్టినట్లు ఆ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. షెడ్యూల్‌ ప్రకారం 2024 జనవరి 17లోపు అసెంబ్లీ ఎన్నికలు జరిగి కొత్త శాసనసభ ఏర్పడాల్సి ఉంటుంది. అంటే, 2023 జులై నుంచి జనవరి లోపు ఎప్పుడైనా ఎన్నికలు రావచ్చు. అయితే ఈసారి కూడా సీఎం కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్తారనే అంచనాలు ఇటు టీఆర్‌ఎస్‌ వర్గాల్లో, అటు విపక్షాల్లో ఉన్నాయి. ఎలాగూ లోక్‌సభ సార్వత్రిక ఎన్నికలు 2024 మార్చి-ఏప్రిల్‌లో జరగాలి. ఇందుకు ఏడాదిన్నర-రెండేళ్ల వ్యవధి మాత్రమే ఉంది. ఈ మేరకు ఇప్పుడు నియమితులైన పార్టీ జిల్లా అధ్యక్షులు వచ్చే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల వరకు టీఆర్‌ఎస్‌ తరఫున క్షేత్రస్థాయి సారథులుగా వ్యవహరించడం లాంఛనమే! ఈ కారణంగానే జిల్లా అధ్యక్షుల నియామకంలో సీఎం కేసీఆర్‌ అన్ని సమీకరణాలను పరిగణనలోకి తీసుకున్నట్లు టీఆర్‌ఎస్‌ ముఖ్యులు విశ్లేషిస్తున్నారు. అయితే జిల్లా స్థాయిలో ‘పవర్‌ సెంటర్‌’ నియంత్రణ కోసమే అధ్యక్ష పదవుల కోసం ఇతర నేతల పేర్లను పరిశీలించలేదనే చర్చ కూడా పార్టీలో నడుస్తోంది. ‘‘పార్టీ పరంగా జిల్లా స్థాయిలో అధ్యక్ష పదవి ముఖ్యమైంది. ఈ సమయంలో బాధ్యతలు నిర్వర్తించిన వాళ్లు వచ్చే ఎన్నికల నాటికి పార్టీ టికెట్‌ ఆశించడం సహజం. అంతేకాకుండా వారు జిల్లా స్థాయిలో పవర్‌ సెంటర్‌గా మారే అవకాశం ఉంది. ఇది జిల్లాలోని పార్టీ ఎమ్మెల్యేలకు ఇబ్బందిగా మారవచ్చు. అందుకే సీఎం కేసీఆర్‌ ఈ నిర్ణయం తీసుకొని ఉండొచ్చు’’ అని టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేతలు అంటున్నారు. అలాగే రాబోయేది ఎన్నికల కాలమే కాకుండా, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై రాజకీయ పోరాటాన్ని ఉధృతం చేయాలనే ఆలోచన మేరకు పార్టీ కార్యక్రమాలు పెరుగుతాయి. ఈ వ్యవహారాలు కొంత ఖర్చుతో ముడిపడి ఉంటాయి. వాటిని ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పార్టీ జిల్లా అధ్యక్షులుగా ఉంటేనే, సరిగా హ్యాండిల్‌ చేయగలరని కేసీఆర్‌ భావించి ఉండొచ్చని అంటున్నారు. 

Updated Date - 2022-01-27T17:47:45+05:30 IST