UAE floods: పుజైరాలో పనిచేసే చోట.. వరదనీటిలో కొట్టుకుపోయి తెలుగు ప్రవాసుడు మృతి

ABN , First Publish Date - 2022-08-02T14:32:25+05:30 IST

అకాల వర్షాలు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)ను అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. గడిచిన 27 ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా భారీ వర్షాలు గత గురు, శుక్రవారాల్లో యూఏఈలోని రాస్ అల్ ఖైమా (Ras Al Khaimah), పుజైరా (Fujairah), షార్జా (Sharjah)లలో కురిశాయి.

UAE floods: పుజైరాలో పనిచేసే చోట.. వరదనీటిలో కొట్టుకుపోయి తెలుగు ప్రవాసుడు మృతి

జెడ్డా: అకాల వర్షాలు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)ను అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. గడిచిన 27 ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా భారీ వర్షాలు గత గురు, శుక్రవారాల్లో యూఏఈలోని రాస్ అల్ ఖైమా (Ras Al Khaimah), పుజైరా (Fujairah), షార్జా (Sharjah)లలో కురిశాయి. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం అయ్యాయి. దీంతో రంగంలోకి దిగిన సైన్యం ఆయా ప్రాంతాల్లోని వేలాది మందిని పునరవాస కేంద్రాలకు తరలించింది. ఇక ఈ వరదల ధాటికి ఏడుగురు ఆసియా వాసులు చనిపోయినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. తాజా సమాచారం ప్రకారం చనిపోయిన వారిలో మంచిర్యాల జిల్లాకు చెందిన తెలువ్యక్తి ఉప్పల లింగా రెడ్డి(35) ఉన్నట్లు తెలుస్తోంది. జన్నారం మండలం, మంచిర్యాల జిల్లాకు చెందిన లింగారెడ్డి పుజైరాలో ఉపాధి కోసం వెళ్లాడు. అక్కడి ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. వర్షం పడిన రోజు కూడా ఎప్పటిలాగే నైట్ షిఫ్ట్‌ విధులకు వెళ్లాడు. 


అయితే, వర్క్ సైట్‌కు చేరుకున్న కొద్దిసేపటి తర్వాత వరదలకు సంబంధించి సంస్థ యాజమాన్యం ప్రకటన చేసింది. వర్కర్లు వెంటనే సైట్ నుంచి వెళ్లిపోవాలని తెలిపింది. దీంతో మరో 20 మందితో కలిసి లింగారెడ్డి కూడా బస్సు ఎక్కేందుకు క్యూలో నిల్చున్నాడు. అందరూ ఒకరిచేయి మరొకరు పట్టుకుని బస్సు ఎక్కుతుండగానే ఒక్కసారిగా పొటెత్తిన వరదధాటికి క్యూలైన్ చివరలో ఉన్న లింగారెడ్డి కొట్టుకుపోయినట్లు తోటికార్మికుడు అంజన్న వెల్లడించాడు. కొద్దిసేపటి తర్వాత అతడి మృతదేహాన్ని గుర్తించి బయటకు తీసినట్లు తెలిపాడు. ప్రస్తుతం మృతదేహం పుజైరా ఆస్పత్రిలో ఉన్నట్లు అంజన్న చెప్పాడు. అయితే, దుబాయ్‌లోని ఇండియన్ కాన్సులేట్ మాత్రం వరదల కారణంగా చనిపోయినట్లు లింగారెడ్డి మృతిపై గానీ ఏ భారతీయ ప్రవాసులు గురించి అధికారిక ప్రకటన చేయలేదు.    

Updated Date - 2022-08-02T14:32:25+05:30 IST