ప్రవాసులకు టీకా పాట్లు.. గల్ఫ్‌ దేశాలకు తిరిగి వెళ్లలేక‌ వేల మందికి తిప్పలు

ABN , First Publish Date - 2021-06-16T14:09:54+05:30 IST

ఉద్యోగ, ఉపాధి నిమిత్తం గల్ఫ్‌ దేశాలకు వెళ్లేవారిని ప్రత్యేకంగా గుర్తించి కేరళ, కర్ణాటక 28 రోజుల వ్యవధిలో రెండు డోసుల కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ ఇస్తుండగా, తెలుగు రాష్ట్రాల్లో పూర్తిగా విస్మరించారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఫలితంగా స్వదేశానికి వెళ్లి ఇరుక్కుపోయిన వేలాది మంది ప్రవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ప్రవాసులకు టీకా పాట్లు.. గల్ఫ్‌ దేశాలకు తిరిగి వెళ్లలేక‌ వేల మందికి తిప్పలు

ప్రాధాన్య క్రమంలో చేర్చని తెలుగు రాష్ట్రాలు

రెండో డోసు వ్యవధి తగ్గించకపోవడంతో ఇబ్బందులు

14 రోజుల క్వారంటైన్‌తో తడిసి మోపెడవుతున్న ఖర్చు

గల్ఫ్‌ తిరిగి రావాలంటే విమాన టికెట్‌కు వ్యాక్సిన్‌ లింకు

(ఆంధ్రజ్యోతి గల్ఫ్‌ ప్రతినిధి): ఉద్యోగ, ఉపాధి నిమిత్తం గల్ఫ్‌ దేశాలకు వెళ్లేవారిని ప్రత్యేకంగా గుర్తించి కేరళ, కర్ణాటక 28 రోజుల వ్యవధిలో రెండు డోసుల కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ ఇస్తుండగా, తెలుగు రాష్ట్రాల్లో పూర్తిగా విస్మరించారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఫలితంగా స్వదేశానికి వెళ్లి ఇరుక్కుపోయిన వేలాది మంది ప్రవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రెండు డోసుల వ్యాక్సిన్‌ తీసుకున్న వారు మాత్రమే తిరిగి రావడానికి అర్హులని సౌదీ అరేబియా ప్రకటించింది. యూఏఈ, ఇతర గల్ఫ్‌ దేశాలు సైతం ఇదే విధానాన్ని ప్రకటించే అవకాశాలున్నాయి. గల్ఫ్‌ దేశాలకు తిరిగిరాకముందే ప్రత్యేక పోర్టల్‌ ద్వారా వ్యాక్సినేషన్‌ వివరాలు సమర్పించిన వారికి మాత్రమే విమాన టికెట్లు విక్రయించాలనే నిబంధన ఉంది. వ్యాక్సిన్‌ తీసుకోని పక్షంలో 14 రోజులు విధిగా హోటల్‌ లో క్వారంటైన్‌లో ఉండాలని ఆదేశాలున్నాయి. విమాన టికెట్‌ కంటే ఎక్కువగా హోటల్‌ క్వారంటైన్‌ ఖర్చు ఉండడంతో ప్రవాసులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. సౌదీ, యూఏఈ, ఒమన్‌ దేశాలు.. భారత విమానాల రాకపోకలు నిషేధించడంతో ఆయా దేశాల్లో పని చేస్తున్న ప్రవాసీయులు సోవియట్‌ రిపబ్లిక్‌లో 14 రోజులు ఉండి, అక్కడి నుంచి ఆయా దేశాలకు వెళ్లాక మరో 14రోజులు క్వారంటైన్‌ ఉండాల్సి రావడంతో ప్రయాణ ఖర్చు పదింతలు పెరిగింది.


వీసా గడువు ముగుస్తున్నవారి పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. గల్ఫ్‌లో మొదటి డోసు తీసుకొని, స్వదేశానికి వెళ్లినవారికి అదే రకమైన వ్యాక్సిన్‌ భారత్‌లో అందుబాటులే లేకపోవడంతో సమస్య ఎదురవుతోంది. వ్యాక్సిన్‌ తీసుకునే క్రమంలో పాస్‌పోర్టు నంబర్‌కు బదులుగా ఆధార్‌ నంబర్‌ను మాత్రమే అనుమతిస్తుండడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గల్ఫ్‌ తిరిగి వెళ్లాలనుకునే ప్రవాసులకు ప్రాధాన్యతా క్రమంలో కొవిషీల్డ్‌ ఇవ్వాలని కోరుతున్నారు. విదేశీ మారకద్రవ్యాన్ని సంపాందించి పెట్టే ప్రవాసీ ఉద్యోగులను కాదని, భారత్‌ నుంచి మారకద్రవ్యాన్ని తీసుకెళ్లే విద్యార్ధులకు ప్రాధాన్యం ఇవ్వడంపైనా నిరసన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2021-06-16T14:09:54+05:30 IST