Telugu States Rain Update: అబ్బో.. వాన ఇప్పట్లో వదిలేలా లేదుగా.. తాజా అప్‌డేట్ ఏంటంటే..

ABN , First Publish Date - 2022-07-14T02:09:33+05:30 IST

తెలుగు రాష్ట్రాలను (Telugu States) మరీ ముఖ్యంగా తెలంగాణను వర్షాలు (Telangana Rains) తడిపి ముద్ద చేస్తున్నాయి. మూడు రోజులుగా..

Telugu States Rain Update: అబ్బో.. వాన ఇప్పట్లో వదిలేలా లేదుగా.. తాజా అప్‌డేట్ ఏంటంటే..

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలను (Telugu States) మరీ ముఖ్యంగా తెలంగాణను వర్షాలు (Telangana Rains) తడిపి ముద్ద చేస్తున్నాయి. మూడు రోజులుగా ముసురు పట్టింది. ఎండ ముఖం చాటేసింది. తాజాగా.. తెలంగాణలో వర్షాలకు సంబంధించి భారత వాతావరణ శాఖ (IMD) ట్వీట్ చేసింది. గురువారం కూడా (జులై 14) తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ట్విట్టర్‌లో (IMD Twitter) పేర్కొంది. దాదాపు 17వ తేదీ వరకూ తెలంగాణలో వర్ష ప్రభావం ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. 14వ తేదీన తెలంగాణలోని ఆదిలాబాద్, కొమరం భీమ్ అసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని.. కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. జులై 18వ తేదీకి గానీ.. అంటే వచ్చే సోమవారానికి గానీ తెలంగాణను వాన ముసురు వీడేలా లేదు.



ఏపీలో (AP) కడప జిల్లాతో (Kadapa District) పాటు నంద్యాలలోని (Nandyal) నల్లమల బెల్ట్‌లో, ప్రకాశం (Prakasam) జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో, తిరుపతి జిల్లాలో వర్ష ప్రభావం ఉంటుందని తెలిసింది. హైదరాబాద్ నగరంలో కూడా మరో మూడు రోజులు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దక్షిణ ఒడిశా (South Odisha), ఉత్తరాంధ్ర పరిసర ప్రాంతాల్లో ఉన్న అల్పపీడనం మంగళవారం తీవ్ర అల్పపీడనంగా మారి బలపడినట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది ఒడిశా తీర ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉందని వెల్లడించింది. ఇందుకు అనుబంధంగా ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉందని తెలిపింది. దీంతో తెలంగాణలో బుధ, గురువారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.



తూర్పున బంగాళాఖాతం నుంచి పడమర అరేబియా సముద్రం మధ్య విస్తరించిన షీర్‌ జోన్‌ (Shear Zone) వల్లే వారం రోజులుగా దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. షీర్‌ జోన్‌ వారం రోజులుగా 19 నుంచి 20 డిగ్రీల అక్షాంశాల మధ్యే (ఉత్తర కోస్తా నుంచి ఒడిసాలో భువనేశ్వర్‌ మధ్య) ఉండిపోయింది. అదే సమయంలో రుతుపవనాల ద్రోణి తూర్పు భాగం ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిసాల మీదుగా కొనసాగుతోంది. ఒడిసా, ఛత్తీస్‌గఢ్‌, ఉత్తర తెలంగాణ, విదర్భ, మధ్య మహారాష్ట్రలో ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తున్నాయి. రుతుపవన ద్రోణి ఉత్తరాదికి వెళ్లేందుకు మరో మూడు, నాలుగు రోజులు పడుతుందని, అప్పటిదాకా మధ్య, దక్షిణ, పశ్చిమ భారతాల్లో వర్షాలు కురుస్తాయని నిపుణులు వెల్లడించారు.

Updated Date - 2022-07-14T02:09:33+05:30 IST