మరోసారి తెరపైకి Temple వివాదం

ABN , First Publish Date - 2021-10-27T16:16:16+05:30 IST

ఫిలింనగర్‌ రామానాయుడు స్టూడియో సమీపంలోని అభయాంజనేయ స్వామి ఆలయ వివాదం ఇప్పట్లో సమసిపోయేలా కనిపించడం లేదు. ఉన్నచోటే ఆలయం నిర్మించాలని వీహెచ్‌పీ,...

మరోసారి తెరపైకి Temple వివాదం

ఉన్నచోటే నిర్మించాలని రోడ్డుపై బైఠాయించిన వీహెచ్‌పీ, బజరంగ్‌దళ్‌ కార్యకర్తలు

ఫిలింనగర్‌లో ఉద్రిక్తత


హైదరాబాద్/బంజారాహిల్స్‌: ఫిలింనగర్‌ రామానాయుడు స్టూడియో సమీపంలోని అభయాంజనేయ స్వామి ఆలయ వివాదం ఇప్పట్లో సమసిపోయేలా కనిపించడం లేదు. ఉన్నచోటే ఆలయం నిర్మించాలని వీహెచ్‌పీ, బజరంగ్‌దళ్‌ మహా హారతి నిర్వహించేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డుపై బైఠాయించారు. దీంతో ఫిలింనగర్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రామానాయుడు స్టూడియో సమీపంలో పది ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని ప్రైవేటు సంస్థకు అప్పగించిన విషయం విదితమే. ఆ స్థలంలో ఉన్న అభయాంజనేయ స్వామి ఆలయాన్ని నిర్మాణ దారులు మరోచోటుకు తరలించారు. అప్పటి నుంచి ఇది వివాదాస్పదంగా మారింది. బీజేపీ ఖైరతాబాద్‌ నియోజకవర్గం నాయకుడు పల్లపు గోవర్ధన్‌తోపాటు వీహెచ్‌పీ, బజరంగ్‌దళ్‌ దీనిపై పోరాటం చేయడంతో నిర్మాణదారులు ఉన్నచోటే 2000 గజాల స్థలంలో ఆలయ నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు. తర్వాత ఆలయం మరోచోట నిర్మిస్తామని ప్రకటించారు.


నిర్మాణ దారుడి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వీహెచ్‌పీ అధ్యక్షుడు రామారాజు పిలుపు మేరకు కార్యకర్తలు, బజరంగ్‌దళ్‌, బీజేపీ నాయకులు పల్లపు గోవర్ధన్‌, సుధాకర్‌రెడ్డి, ఆకుల రాజు, అరుణ్‌ తదితరులు మంగళవారం ఆలయంలో కొత్త విగ్రహాన్ని ప్రతిష్టించి మహా హారతి నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. వందలాది మంది కార్యకర్తలు స్థలం వద్దకు రాగా జూబ్లీహిల్స్‌ పోలీసులు వారిని అడ్డుకున్నారు. స్థలంలోకి వెళ్లేందుకు అనుమతి నిరాకరించడంతో రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిర్మాణదారుడి తరఫున ఫిలింనగర్‌ వాసులు కూడా అక్కడికి వచ్చారు. రెండు వర్గాల మధ్య గొడవ జరగకుండా పోలీసులు పికెట్‌ ఏర్పాటు చేశారు. 


రామరాజు మాట్లాడుతూ.. ఇచ్చిన మాటకు నిర్మాణదారుడు కట్టుబడి ఉండాలని డిమాండ్‌ చేశారు. కొంతమంది వెనుక దారి నుంచి వెళ్లి పాత విగ్రహం స్థానంలో కొత్త విగ్రహాన్ని ప్రతిష్టించి పూజలు నిర్వహించారు. వీరిని పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. 

Updated Date - 2021-10-27T16:16:16+05:30 IST