‘పది శాతం’ పంచాయితీ

ABN , First Publish Date - 2022-01-29T05:22:13+05:30 IST

గద్వాల పట్టణంలోని కుంటవీధిలో పబ్లిక్‌ అవసరాల కోసం కేటాయించిన పదిశాతం ఖాళీ స్థలం వివాదంగా మారింది.

‘పది శాతం’ పంచాయితీ
కుంటవీధిలో వివాదాస్పదమైన స్థలం

- వెంచర్‌లో ప్రజల అవసరం కోసం భూమి కేటాయింపు 8 ప్రకృతివనం ఏర్పాటుకు సిద్ధమైన అధికారులు

- ఆ స్థలం తమదంటూ ఓ వ్యక్తి అభ్యంతరం 8 కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా తెగని వివాదం 

గద్వాల టౌన్‌, జనవరి 28 : గద్వాల పట్టణంలోని కుంటవీధిలో పబ్లిక్‌ అవసరాల కోసం కేటాయించిన పదిశాతం ఖాళీ స్థలం వివాదంగా మారింది. సర్వే నెంబరు 917లో ఉన్న స్థలాన్ని 1971లో ఎల్‌పి నెంబర్‌ 53/71 ద్వారా లేఅవుట్‌గా మార్చి ప్లాట్లు విక్రయిం చారు. నిబంధనల మేరకు స్థలం యజమానులు పది శాతం భూమిని ప్రజల అవసరాల కోసం అప్పట్లోనే మునిసిపాలిటీకి అప్పగించారు. పట్టణంలోని మొట్ట మొదటి లేఅవుట్‌ ఇదేనని స్థానికులు చెప్తున్నారు. ఖాళీగా ఉన్న స్థలం గుంతగా ఉండటంతో పైనుంచి వచ్చే వర్షపు నీరంతా అక్కడికి చేరి కుంటగా మారింది. దాదాపు 50 సంవత్సరాల నుంచి ఖాళీగా ఉన్న స్థలంలో ఇటీవల పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా ప్రకృతివనం ఏర్పాటు చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. స్థలాన్ని చదును చేసేందుకు మొరం తరలిస్తున్న క్రమంలో, ఆ స్థలం తనదంటూ అదే వీధికి చెందిన వ్యక్తి ఒకరు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ స్థలానికి సంబంధించి తన పేరు పట్టా కూడా ఉందని చెప్పడం వివాదంగా మారింది. 

విచారణ చేపట్టాలంటున్న స్థానికులు

ప్రజల అవసరాల కోసం గతంలో కేటాయించిన స్థలం వివాదంపై విచారణ చేపట్టాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ విషయంపై గత ఏడాది ఏప్రిల్‌లో మునిసిపల్‌ కమిషనర్‌తో పాటు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. 1971 నుంచి ఖాళీగా ఉన్న స్థలంలో ఇప్పటి వరకు ఎలాంటి నిర్మాణం చేపట్టకుండా ఉన్న వ్యక్తులు, ఇప్పుడు ఆ స్థలం తమదంటూ అభ్యంతరం చెప్పడాన్ని వ్యతిరేకిస్తున్నారు. పట్టణంలోని అన్ని వార్డుల్లో ఇప్పటికే 26కు పైగా టీపార్కులు, ప్రకృతివనాలు ఏర్పాటుచేసిన అధికారులు తమ కాలనీని పట్టించుకోవడం లేదని అంటున్నారు. తాము ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా అధికారులు విచారణ చేపట్టి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. 

Updated Date - 2022-01-29T05:22:13+05:30 IST