సంగారెడ్డి జిల్లాలో పది పాజిటివ్ కేసులు
ABN , First Publish Date - 2020-07-12T10:47:04+05:30 IST
సంగారెడ్డి జిల్లాలో శనివారం 10 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని డీఎంహెచ్వో డాక్టర్ మోజీరాంరాథోడ్ తెలిపారు. సంగారెడ్డి
సంగారెడ్డి అర్బన్, జూలై 11 : సంగారెడ్డి జిల్లాలో శనివారం 10 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని డీఎంహెచ్వో డాక్టర్ మోజీరాంరాథోడ్ తెలిపారు. సంగారెడ్డి పట్టణంలో-2, పటాన్చెరు-2, అమీన్పూర్-2, ఝరాసంగం మండలం కుప్పానగర్, గుమ్మడిదల మండలం బొంతపల్లి, ఆర్సీపురం, బొల్లారంలో ఒక్కోటి చొప్పున కరోనా కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. సంగారెడ్డిలోని జిల్లా ఆస్పత్రి ఐసోలేషన్ నుంచి 73 మంది శాంపిళ్లను సేకరించి కోవిడ్ నిర్ధారణ కోసం గాంధీకి పంపామని డీఎంహెచ్వో చెప్పారు. సంగారెడ్డి పట్టణంలోని బాలాజీనగర్, రెవెన్యూ కాలనీల్లో ఒక్కొక్కరికి కరోనా సోకిందని తెలిపారు. సంగారెడ్డిలోని జిల్లా ఆస్పత్రి కరోనా వార్డులో 22 మంది పాజిటివ్ బాధితులు, కరోనా అనుమానిత లక్షణాలున్న ఆరుగురు ఉన్నారని డీఎంహెచ్వో తెలిపారు.
జిల్లా ఆస్పత్రికి 10 వెంటిలేటర్లు మంజూరు
సంగారెడ్డిలోని జిల్లా ఆస్పత్రికి 10 వెంటిలేటర్లు మంజూరయ్యాయని జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సంగారెడ్డి తెలిపారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఐదేసి చొప్పున మంజూరు చేశాయని తెలిపారు. వెంటిలేటర్ల నిర్వహణకు అవసరమైన అనుభవం కలిగిన డాక్టర్లు, సిబ్బంది, టెక్నీషియన్లను నియమించాల్సి ఉందని చెప్పారు.
రేపటి నుంచి యాంటీజెన్ టెస్టులు
జిల్లాలోని అన్ని సర్కారు ఆస్పత్రుల్లో సోమవారం నుంచి కరోనా నిర్ధారణ పరీక్షల్లో భాగంగా యాంటీజెన్ టెస్టులు చేయనున్నారు. సంగారెడ్డిలోని జిల్లా ఆస్పత్రితో పాటు అన్ని ఏరియా ఆస్పత్రుల్లో కరోనా నిర్ధారణ పరీక్షలను చేయనున్నారు. ఇప్పటికే పటాన్చెరులోని అర్బన్ హెల్త్ సెంటర్ (యూపీహెచ్సీ)లో శనివారం యాంటీజెన్ టెస్టులు ప్రారంభమయ్యాయి. త్వరలో జిల్లాలోని అన్ని పీహెచ్సీల్లో యాంటీజెన్ టెస్టులు చేసేందుకు వైద్యాధికారులు చర్యలు చేపట్టారు. రోజుకు 25 మందికి చొప్పున కరోనా నిర్ధారణ పరీక్షలను చేయనున్నారు.
సుమారు 30 నిమిషాల్లోపే ఫలితాలు వెల్లడవుతాయి. జలుబు, దగ్గు, గొంతు నొప్పి తదితర కరోనా అనుమానిత లక్షణాలున్న వారికి యాంటీజెన్ టెస్టులు చేయనున్నారు. అలాగే ఈ నెలలో డెలివరీ అయ్యే మహిళలు, క్యాన్సర్, డయాబెటీస్ ఉన్న వారికి పరీక్షలు నిర్వహిస్తామని వైద్యాఽధికారులు తెలిపారు. జిల్లా ఆస్పత్రికి 500, ఏరియా ఆస్పత్రికి 100 చొప్పున పరీక్షలకు కావలసిన 1800 కోవిడ్ ర్యాపిడ్ కిట్స్ జిల్లాకు వచ్చాయని డీఎంహెచ్వో డాక్టర్ మోజీరాంరాథోడ్ తెలిపారు.