హైదరాబాద్‌లో మిస్టరీగా పదేళ్ల చిన్నారి మృతి.. హత్య చేశారా!?

ABN , First Publish Date - 2021-03-29T16:18:17+05:30 IST

సైదాబాద్‌ పోలీ‌స్‌స్టేషన్‌ పరిధిలో ఈ నెల 23న పదేళ్ల చిన్నారి..

హైదరాబాద్‌లో మిస్టరీగా పదేళ్ల చిన్నారి మృతి.. హత్య చేశారా!?

హైదరాబాద్/సైదాబాద్‌ : సైదాబాద్‌ పోలీ‌స్‌స్టేషన్‌ పరిధిలో ఈ నెల 23న పదేళ్ల చిన్నారి మృతిపై పలు అనుమనాలు తల్లెత్తుతున్నాయి. తోటి పిల్లలతో కలిసి ఆడుకుంటున్న సమయంలో స్కిప్పింగ్‌ తాడు ఉరిగా బిగిసి మృతి చెంది ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. కానీ తమ కుమార్తెను కొందరు పథకం ప్రకారం హత్య చేసి ఉంటారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. స్థానికంగా ఉన్న ముగ్గురు యువకులపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా చారకొండ మండలం ఓ తండాకు చెందిన దంపతులు బతుకుదెరువు కోసం నగరానికి వలస వచ్చి ఐఎస్‌సదన్‌ డివిజన్‌ గుడిసెలలో నివాసముంటున్నారు. భర్త మేస్ర్తీగా, భార్య ఇళ్లలో పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు.


వీరికి ఇద్దరు కూతుళ్లు, ఓ కుమారుడు. పెద్ద కుమార్తె (10) సమీపంలోని ప్రభుత్వ పాఠశాలలో నాలుగవ తరగతి చదువుతోంది. ఈ నెల 23న ఉదయం తల్లిదండ్రులు కూలీ పనుల నిమిత్తం బయటకు వెళ్లారు. దాంతో వారి పిల్లలు ఇతర చిన్నారులతో కలిసి గుడిసెలలో ఆడుకుంటున్నారు. మధ్యాహ్నం తల్లిదండ్రులు ఇంటికి రాగా గుడిసె ముందు చుట్టుపక్కలవారు గుమికూడి ఉన్నారు. లోపలికి వెళ్లి చూడగా పెద్ద కుమార్తె ఒంటిపై వస్త్రాలు లేకుండా విగతజీవిగా పడి ఉంది. తల్లి ఫిర్యాదు మేరకు సైదాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. చిన్నారి మృతదేహనికి ఉస్మానియాలో పోస్టుమార్టం నిర్వహించి తల్లిదండ్రులకు అప్పగించారు.


సమగ్ర విచారణ చేయండి..

తమ కూతురి మృతిపై సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని ఆ  తల్లిదండ్రులు కోరుతున్నారు. తమ కుమార్తె ఒంటిపై దుస్తులు లేకపోవడం, ఒంటిపై గాయాలు కనిపించడంతో హత్యగా భావిస్తున్నామని చెప్పారు. చిన్నపాటి గుడిసెలో ఉరి వేసుకునే అవకాశం లేదని అంటున్నారు. ఆమెతో ఆడుకున్న పిల్లలు మరీ చిన్నోళ్లని, స్కిప్పింగ్‌ తాడు వేసి గుంజే అవకాశం లేదని చెబుతున్నారు. సోమవారం వచ్చే పోస్టుమార్టం నివేదిక ప్రకారం కేసు దర్యాప్తు సాగుతుందని పోలీసులు తెలిపారు.

Updated Date - 2021-03-29T16:18:17+05:30 IST