‘అనంత’లో ఘోర ప్రమాదం

ABN , First Publish Date - 2021-11-28T08:55:41+05:30 IST

అనంతపురం జిల్లా చెన్నేకొత్తపల్లి మండలం ఎస్‌ఎస్‌ గేటు సమీపాన జాతీయ రహదారి ప్లై ఓవర్‌పై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన ఇద్దరు మరణించగా, ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.

‘అనంత’లో ఘోర ప్రమాదం

నాగర్‌కర్నూల్‌ జిల్లాకు చెందిన దంపతుల దుర్మరణం..

చెన్నేకొత్తపల్లి, నవంబరు 27: అనంతపురం జిల్లా చెన్నేకొత్తపల్లి మండలం ఎస్‌ఎస్‌ గేటు సమీపాన జాతీయ రహదారి ప్లై ఓవర్‌పై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన ఇద్దరు మరణించగా, ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా కోడేరు మండలం నారేనాయక్‌తండాకు చెందిన ఇస్లావత్‌ స్వామినాయక్‌ రోడ్డు నిర్మాణ పనుల కోసం కుటుంబసభ్యులతో కలిసి కారులో హిందూపురం బయల్దేరారు. ఎన్‌ఎ్‌స గేటు వద్దకు రాగానే ఐరన్‌ లోడుతో ముందు వెళ్తున్న లారీడ్రైవర్‌.. అకస్మాత్తుగా బ్రేక్‌ వేయడంతో కారు అదుపు తప్పి బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో స్వామినాయక్‌ (38), అతని భార్య శంకరమ్మ(35) అక్కడికిక్కడే మృతిచెందారు. మృతుల కుమారుడు వెంకటేశ్‌, మూడేళ్ల కుమార్తె అమృత, అత్తమామలు సోమ్లానాయక్‌, సీతమ్మ, కారు నడుపుతున్న స్వామినాయక్‌ బావమరిది రాజు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని కారులో ఇరుక్కున్న వారిని ప్రభుత్వాస్పత్రికి తరలించారు.  ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో కర్నూలుకు తరలించినట్లు తెలిసింది. 

Updated Date - 2021-11-28T08:55:41+05:30 IST