బీజేపీ కార్యకర్తలపై ఉగ్రవాదుల దాడిని ఖండించిన మోదీ
ABN , First Publish Date - 2020-10-30T11:38:36+05:30 IST
జమ్మూకశ్మీరులో బీజేపీ కార్యకర్తలపై ఉగ్రవాదుల దాడి ఘటనను ప్రధాని నరేంద్రమోదీ ఖండించారు.
జమ్మూ: జమ్మూకశ్మీరులో బీజేపీ కార్యకర్తలపై ఉగ్రవాదుల దాడి ఘటనను ప్రధాని నరేంద్రమోదీ ఖండించారు. జమ్మూకశ్మీరులోని కుల్గాం జిల్లాలో గురువారం రాత్రి ముగ్గురు బీజేపీ కార్యకర్తలను ఉగ్రవాదులు కాల్చిచంపారు. ఖాజిగుండ్ ప్రాంతంలోని వైకె పొరా గ్రామంలో గురువారం రాత్రి 8.20 గంటలకు బీజేపీకి చెందిన ముగ్గురు కార్యకర్తలపై గుర్తుతెలియని ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఉగ్రవాదుల కాల్పుల్లో కుల్గాం జిల్లా బీజేపీ యువజన విభాగం ప్రధాన కార్యదర్శి గులాం అహ్మద్ యాటూ కుమారుడు ఫిధాహుసేన్ యాటూ, ఉమర్ రషీద్ బీగ్, ఉమర్ రంజాన్ హజామ్ లపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ముగ్గురిని ఆసుపత్రికి తరలించగా, వారు మరణించారని వైద్యులు ప్రకటించారు.
ఉగ్రవాదుల కాల్పులను బీజేపీ నేతలు ఖండించారు. ఈ దాడి అనంతరం భద్రతాదళాలు ఉగ్రవాదులను పట్టుకునేందుకు గాలిస్తున్నారు. కుల్గాం జిల్లాలో బీజేపీ కార్యకర్తలపై జరిగిన దాడిని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఖండించారు.మృతులకు మోదీ నివాళులు అర్పించారు. ఈ హత్యలపై జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఖండించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం నుంచి సహాయం చేస్తామని గవర్నరు హామీ ఇచ్చారు.