వ్యాధుల బూచి.. రూ. వేలు దోచి
ABN , First Publish Date - 2021-07-26T04:11:53+05:30 IST
అశ్వారావుపేట పట్టణంలో కొందరు ప్రైవేటు ల్యాబ్ల్లో ఎటువంటి అనుమతుల్లేకుండా డెంగ్యూ, కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు.
అశ్వారావుపేటలో ప్రైవేట్ ల్యాబ్ల దందా
అనుమతుల్లేకుండానే ఏర్పాటు.. కనీస సౌకర్యాలు మృగ్యం
కరోనా, డెంగ్యూ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్న తీరు
ప్యాకేజీ మాట్లాడుకుని చికిత్స.. నిలువు దోపిడీకి గురవుతున్న రోగులు
అశ్వారావుపేట, జూలై 24: అశ్వారావుపేట పట్టణంలో కొందరు ప్రైవేటు ల్యాబ్ల్లో ఎటువంటి అనుమతుల్లేకుండా డెంగ్యూ, కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. నేరుగా రోగులకు వైద్యచికిత్సలు అందిస్తున్నట్టు ఆరోపణలున్నాయి. కనీస అనుమతుల్లేకుండానే ల్యాబ్లు ఏర్పాటు చేయడం, ఇష్టానుసారంగా పరీక్షలు చేయడం, వైద్యచికిత్సలు చేస్తూ రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. వాస్తవానికి ల్యాబ్లు ఏర్పాటు చేయాలంటే జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో రిజిస్టర్ అవ్వడంతో పాటు అందులో నిబంధనల ప్రకారం అన్ని సౌకర్యాలు కల్పించాలి. అర్హత కలిగిన ల్యాబ్ అసిస్టెంట్ పర్యవేక్షణలో పరీక్షలు నిర్వహించాలి. పట్టణంలో ఏర్పాటు చేసిన ల్యాబ్ల్లో అత్యధికశాతం కనీస అనుమతుల్లేనివని తెలుస్తోంది. కొన్ని ల్యాబ్లలో కొవిడ్, డెంగ్యూ టెస్ట్లంటూ స్ట్రిప్ల ఆధారంగా పరీక్షలు నిర్వహించడమే కాకుండా, వారికి చికిత్సలు చేసేందుకు రూ. వేలు ప్యాకేజీ మాట్లాడుకొంటున్నారని ఆంధ్రజ్యోతి పరిశీలనలో తేలింది. జిల్లాలో కొత్తగూడెం, ఇల్లందు, భద్రాచలంలో మాత్రమే డెంగ్యూ నిర్ధారణ పరీక్షలు చేసేందుకు అనుమతులుండగా, అశ్వారావుపేటలోని కొన్ని ప్రైవేటు ల్యాబ్లు స్ట్రిప్ల ఆధారంగా ఈ పరీక్షలు నిర్వహిస్తు రోగుల జేబులకు చిల్లులు పెడుతున్నారు.
దీనిపై డా. హరీష్ను వివరణ కోరగా ల్యాబ్ ఏర్పాటు చేసే వారు జిల్లా వైద్యఆరోగ్యశాఖలో రిజిస్ర్టేషన్ చేయించుకుంటారని, వీరిపై జిల్లాలో ప్రత్యేక అధికార బృందం పర్యవేక్షణ ఉంటుందన్నారు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే ఉన్నతాధికారులకు నివేదిక ఇస్తామన్నారు. కొవిడ్ పరీక్షలు బయట చేయడం నిషేధమన్నారు. డెంగ్యూ కూడా స్ట్రిప్ పద్దతిలో చేయడం నిషిద్ధమన్నారు.