America లో ఓ ఖైదీ విన్నపం.. కిడ్నీని దానం చేయాలి.. నా మరణ శిక్షను కొద్ది రోజులు వాయిదా వేయండంటూ..

ABN , First Publish Date - 2022-07-03T02:17:27+05:30 IST

తన కిడ్నీ దానం చేసేవరకూ మరణ శిక్ష అమలును వాయిదా వేయాలంటూ అమెరికాలోని ఓ ఖైదీ టెక్సాస్ రాష్ట్ర గవర్నర్‌ను వేడుకున్నాడు.

America లో ఓ ఖైదీ విన్నపం.. కిడ్నీని దానం చేయాలి.. నా మరణ శిక్షను కొద్ది రోజులు వాయిదా వేయండంటూ..

ఎన్నారై డెస్క్: తన కిడ్నీ దానం చేసేవరకూ మరణ శిక్ష అమలును వాయిదా వేయాలంటూ అమెరికాలోని ఓ ఖైదీ టెక్సాస్(Texas) రాష్ట్ర గవర్నర్‌ను వేడుకున్నాడు. 2001లో ఓ టీనేజ్ యువతిని తుపాకీతో కాల్చి చంపిన నేరంలో దోషిగా తేలిన రమీరో గోంజాలెస్‌కు న్యాయస్థానం మరణ శిక్ష విధించింది. జూలై 13న ప్రాణాంతక ఇంజెక్షన్(Lethal Injection) ఇచ్చి మరణ శిక్షను అమలు చేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే రమీరో తరపు లాయర్లు గవర్నర్ గ్రెగ్ ఆబట్‌కు ఓ లేఖ రాశారు. కిడ్నీ దానం చేయాలన్న రమీరో అభిలాషను తెలియజేస్తూ అతడి మరణశిక్షను 30 రోజుల పాటు వాయిదా వేయాలని కోరారు. రమీరోది అరుదైన బ్లడ్ గ్రూప్‌ అని చెప్పారు. అతడి కారణంగా మరొకరికి కొత్త జీవితం లభించే అవకాశం ఉందన్నారు. 


ఈ విషయంలో రమీరోకు శిక్ష అమలులో జాప్యం సృష్టించాలన్న దురుద్దేశమేదీ లేదని చెప్పారు. మరొకరికి ఉపయోగపడాలనే అతడు ఈ నిర్ణయం తీసుకున్నాడంటూ స్థానిక మతప్రచారకుడు రాసిన లేఖను కూడా తమ విజ్ఞాపన పత్రంలో పేర్కొన్నారు. రమీరో పూర్తి ఆరోగ్యంతో ఉన్నాడంటూ టెక్సాస్ యూనివర్శిటీ మెడికల్ బ్రాంచ్ వైద్యులు ఇచ్చిన ధ్రువీకరణ పత్రాన్ని కూడా ప్రస్తావించారు. అయితే.. ఖైదీల అవయవ దానం అంశాన్ని పరిశీలించే టెక్సాస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ క్రిమినల్ జస్టిస్..గతంలోనే రమీరో అభ్యర్థనను తిరస్కరించింది. ఈ నిర్ణయానికి కారణమేంటనేది మాత్రం వెల్లడించలేదు. అయితే.. రమీరో మరణ శిక్ష పడ్డ ఖైదీ అన్న కారణంగానే అతడి అభ్యర్థనను తిరస్కరించారని అతడి లాయర్లు చెబుతున్నారు. ఇక.. ఈ లేఖపై గవర్నర్ కార్యాలయం ఇప్పటివరకూ స్పందించలేదు. 

Updated Date - 2022-07-03T02:17:27+05:30 IST