ఒమైక్రాన్పై పోరాటం.. కేంద్ర మంత్రికి ఆదిత్య ఠాక్రే లేఖ
ABN , First Publish Date - 2021-12-07T21:09:52+05:30 IST
మహారాష్ట్రలో కోవిడ్ వేరియంట్ ఒమైక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర మంత్రి ఆదిత్య..
ముంబై: మహారాష్ట్రలో కోవిడ్ వేరియంట్ ఒమైక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర మంత్రి ఆదిత్య థాకరే కేంద్రానికి మూడు సూచనలు చేశారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయకు మంగళవారంనాడు లేఖ రాశారు. ఒమైక్రాన్ వేగంగా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు తాను పలువురు వైద్యులను సంప్రదించానని చెప్పారు. అందుకు అనుగుణంగా తాను సూచనలు చేస్తున్నట్టు ఆ లేఖలో పేర్కొన్నారు. బూస్టర్ షాట్లను తీసుకునేందుకు అనుమతించాలని, వ్యాక్సినేషన్ వయస్సును, రెండు డోసుల మధ్య పాటించాల్సిన గ్యాప్ను తగ్గించాలని ఆదిత్య థాకరే సూచించారు.
''ఇండియాలో వ్యాక్సినేషన్ డ్రైవ్ ఇటీవలం కాలంగా గణనీయమైన పురోగతి సాధించింది. కోవిడ్ నుంచి పౌరులందరికీ రక్షణ కవచం ఏర్పరచేందుకు ప్రయత్నాలు జరిగాయి. దాదాపు దేశవాసులందరి జీవన స్థితిగతులు సాధారణ స్థితికి చేరుకుంటున్న దశలో ఒమైక్రాన్ ముప్పు తొంగిచూస్తోంది'' అని ఆ లేఖలో ఆదిత్య పేర్కొన్నారు.
ఆదిత్య సూచనలు..
1.ఫ్రంట్లైన్ వర్కర్లకు బూస్టర్ డోస్: ఈ ఏడాది ప్రారంభంలో వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న ఫ్రంట్లైన్ వర్కర్లు, హెల్త్ కేర్ వర్కర్లను వారి కోరిక మేరకు మూడో డోస్ తీసుకునేందుకు అనుమతించాలి.
2.వ్యాక్సినేష్ ఏజ్ను తగ్గించాలి: వ్యాక్సినేషన్ తీసుకునేందుకు అనుమతించే కనీన వయో పరిమితిని 15 ఏళ్లకు తగ్గించాలి. ఇందువల్ల సెకండరీ స్కూల్, జూనియర్ కాలేజీ విద్యార్థులకు వ్యాక్సినేషన్ రక్షణ కలుగుతుంది.
3.రెండు డోసుల మధ్య గ్యాప్ తగ్గించడం: వ్యాక్సిన్ మొదటి డోసుకు, రెండో డోసుకు మధ్య గ్యాప్ను నాలుగు వారాలకు తగ్గించాలి. 2020 జనవరి మధ్య నాటికి రెండో డోస్ పూర్తి చేయాలి.