టీకా తీసుకున్నారా.. అయితే బ్యాగ్ సర్దండి.. థాయ్‌లాండ్ రమ్మంటోంది

ABN , First Publish Date - 2021-05-29T22:48:54+05:30 IST

ట్రావెల్ చేయడం అంటే కొందరికి మహా సరదా. ట్రావెల్ చేయడాన్నే హాబీగా పెట్టుకుని ప్రపంచ వ్యాప్తంగా పర్యటిస్తూ ఉంటారు. భూమిపై ఉన్న వింతలు, విశేషాలను చూస్తూ.. మధుర అనుభూతులను సొంతం చేసు

టీకా తీసుకున్నారా.. అయితే బ్యాగ్ సర్దండి.. థాయ్‌లాండ్ రమ్మంటోంది

బ్యాంకాక్: ట్రావెల్ చేయడం అంటే కొందరికి మహా సరదా. ట్రావెల్ చేయడాన్నే హాబీగా పెట్టుకుని ప్రపంచ వ్యాప్తంగా పర్యటిస్తూ ఉంటారు. భూమిపై ఉన్న వింతలు, విశేషాలను చూస్తూ.. మధుర అనుభూతులను సొంతం చేసుకుంటుంటారు. అయితే.. అలాంటి వారికి కరోనా మహమ్మారి రూపంలో పెద్ద కష్టమే వచ్చింది. కరోనా విజృంభణ నేపథ్యంలో ప్రపంచ దేశాలు ప్రయాణ ఆంక్షలు విధించడంతో వారి కాళ్లకు సంకెళ్లు పడ్డాయి. కాగా.. ఇటువంటి వారికి థాయ్‌లాండ్ తీపి కబురు చెప్పింది. అంతర్జాతీయ పర్యాటకులకు త్వరలో గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్టు ప్రకటించింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. 



అంతర్జాతీయ పర్యాటకులకు స్వాగతం పలుకుతున్నట్టు థాయ్‌లాండ్ ప్రకటించింది. తమ దేశంలో టూరిజంను తిరిగి ప్రారంభిస్తున్నట్టు పేర్కొంది. వ్యాక్సిన్ తీసుకున్న అంతర్జాతీయ పర్యాటకులను జూలై 1 నుంచి తమ దేశంలోకి అనుమతించనున్నట్టు వెల్లడించింది. ఇందుకోసం ‘పుకెట్ సాండ్‌బాక్స్ ప్రోగ్రామ్’ను ప్రారంభిస్తున్నట్టు తెలిపింది. ఈ ప్రోగ్రామ్‌లో భాగంగా వ్యాక్సిన్ తీసుకున్న పర్యాటకులను మొదటగా పుకెట్‌ ఐలాండ్‌లోకి అనుమతిస్తామని తెలిపింది. ఈ ఐలాండ్‌లో పర్యాటకులు ఏడు రోజులపాటు గడిపిన తర్వాత.. థాయ్‌లాండ్‌లోని ఇతర ప్రదేశాలను సందర్శించవచ్చని వెల్లడించింది. 



కాగా.. ప్రయాణానికి 14 రోజుల ముందు పర్యాటకులు వ్యాక్సిన్‌ను వేసుకోవాల్సి ఉంటుందని థాయ్‌లాండ్ స్పష్టం చేసింది. అంతేకాకుండా వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ చూపిన వారిని మాత్రమే తమ దేశంలోకి అనుమతిస్తామని చెప్పింది. అయితే మైనర్లు వ్యాక్సినేషన్ సర్టిఫికేట్‌ను చూపాల్సిన అవసరం లేదని వెల్లడించింది. అయితే 12-18 మధ్య వయసు గల వారు రాపిడ్ యాంటిజెన్ టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. ఇదిలా ఉంటే.. విదేశీ పర్యాటకులకు స్వాగతం పలుకుతున్నట్టు ప్రకటించిన థాయ్‌లాండ్ భారతీయులకు మాత్రం నిరాశనే మిగిల్చింది. ప్రస్తుతం యూకే, ఫ్రాన్స్, జర్మనీ, స్కాండినేవియా.. తదితర దేశాల పర్యాటకులనే తమ దేశంలోకి అనుమతిస్తున్నట్టు వెల్లడించింది. విడతలవారీగా ఇతర దేశాల పర్యాటకులను కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్టు స్పష్టం చేసింది. 


Updated Date - 2021-05-29T22:48:54+05:30 IST