ఆ డైలాగ్‌ ఎన్టీఆర్‌దే!

ABN , First Publish Date - 2022-03-06T05:31:10+05:30 IST

నందమూరి బాలకృష్ణ నటించిన ‘నరసింహనాయుడు’ చిత్రంలో

ఆ డైలాగ్‌ ఎన్టీఆర్‌దే!

నందమూరి బాలకృష్ణ నటించిన ‘నరసింహనాయుడు’ చిత్రంలో ‘కత్తులతో కాదురా.. కంటి చూపుతో చంపేస్తా అనే డైలాగ్‌ ఉంది. పరుచూరి సోదరులు రాసిన ఈ డైలాగ్‌ చాలా పాపులర్‌ అయింది.  ఆ సినిమా వచ్చి ఇప్పటికి 21 ఏళ్లు అయినా ఆ డైలాగ్‌ ఇప్పటికీ జనం నోళ్లలో నానుతూనే ఉంది. అయితే ఒరిజనల్‌గా ఈ డైలాగ్‌ పరుచూరి సోదరులది కాదు.. మహానటుడు ఎన్టీఆర్‌ది. అదేలాగంటే..


రాజకీయాల్లోకి వెళ్లే ముందు ఎన్టీఆర్‌ నటించిన చివరి చిత్రం ‘నాదేశం’. కె. బాపయ్య దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి కె.దేవీవరప్రసాద్‌, ఎస్‌.వెంకటరత్నం నిర్మాతలు.  హిందీలో అమితాబ్‌ నటించిన ‘లావరిస్‌’ సినిమాకు ఇది రీమేక్‌. .


అసలు  విషయానికి వస్తే... ‘నాదేశం’లో ముగింపు సన్నివేశంలో మాత్రమే ఒకే ఒక ఫైట్‌ ఉంది. మాస్‌ ఇమేజ్‌ కలిగిన ఎన్టీఆర్‌కు కేవలం ఒకేఒక ఫైట్‌ కాకుండా  మరో ఫైట్‌ ఉంటే బాగుంటుందని నిర్మాతల అభిప్రాయం. అయితే ఆ విషయం డైరెక్ట్‌గా ఎన్టీఆర్‌కు చెప్పలేక, ఆ బాధ్యతను పరుచూరి గోపాలకృష్ణకు అప్పగించారు. ఒక రోజు ఎన్టీఆర్‌ను ఇంటి దగ్గర పికప్‌ చేసుకొని కారులో షూటింగ్‌కు బయలుదేరారు. ముందు సీటులో దేవీవరప్రసాద్‌, ఎన్టీఆర్‌ మేక్‌పమన్‌ , వెనుక సీటులో ఎన్టీఆర్‌, పరుచూరి గోపాలకృష్ణ కూర్చున్నారు.

మాటల మధ్యలో సినిమాలో మరో ఫైట్‌ ఉంటే బాగుంటుందనే విషయాన్ని ప్రస్తావించారు గోపాలకృష్ణ. ఎన్టీఆర్‌కు మూడ్‌ బాగుండటంతో ‘ ఏ సీనులో ఆ ఫైట్‌ పెడతారు?’ అని ప్రసన్నంగా అడిగారు.

పరుచూరి గోపాలకృష్ణ ఒక ఆర్టిస్ట్‌  పేరు చెప్పి ‘ ఈ సందర్భంలో వారితో మీకు ఫైట్‌ పెడితే బాగుంటుందండి’ అని చెప్పారు.

‘అసలు బాగుండదు’ అని చెప్పి ఆ విషయం అంతటితో ముగించారు ఎన్టీఆర్‌. 

అది  గ్రహించి టాపిక్‌ మళ్లీంచారు గోపాలకృష్ణ. అయితే ముందు సీటులో ఉన్న దేవీవరప్రసాద్‌ మాత్రం  ఆ విషయాన్ని వదిలిపెట్టలేదు. ‘మళ్లీ అడుగు’ అన్నట్లు గోపాలకృష్ణకు సైగ చేశారు.

దాంతో ధైర్యం చేసి ‘అది కాదు అన్నగారూ.. మీరు నాలుగు దెబ్బలేసినా మాలాంటి అభిమానులకు ఆనందంగా ఉంటుంది కదా’ అన్నారు. దేవీవరప్రసాద్‌ ఈ విషయం అడిగిస్తున్నారన్న విషయం ఎన్టీఆర్‌కు అర్థమైంది.



అందుకే వివరణ ఇస్తూ ‘దేనికైనా ఓ స్థాయి ఉంటుంది. సత్యనారాయణగారితో ఫైట్‌ ఉంటే  చెప్పండి.. చేస్తాం. అంతేకానీ మీరు చెప్పిన వారితో ఫైట్‌ చెయ్యమంటారా.. మేం గట్టిగా కన్నెర్ర చేస్తే గుండాగి చస్తారు వారు’ అన్నారు. 

ఈ సంఘటన 1982లో జరిగింది.  ఇరవై ఒక ఏళ్ల అనంతరం వచ్చిన ‘నరసింహనాయుడు’ చిత్రంలో యధాలాపంగా ‘కత్తులతో  కాదురా.. కంటి చూపుతో చంపేస్తా’ అనే డైలాగ్‌ రాశారు గోపాలకృష్ణ. రాసిన తర్వాత కానీ అది ఎన్టీఆర్‌ ఆ నాడు తనతో అన్న డైలాగ్‌ అని ఆయనకు గుర్తు రాలేదు.


Updated Date - 2022-03-06T05:31:10+05:30 IST