తెలుగు ఆనకట్టల దురాక్రమణ చెల్లదు

ABN , First Publish Date - 2022-03-04T06:56:47+05:30 IST

న్యాయాన్యాయాలు ఆలోచించకుండా ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో కృష్ణా గోదావరి నదులపై అన్ని ప్రాజెక్టులను స్వాధీనం చేయాలని ఆదేశిస్తూ ఢిల్లీ ప్రభువులు రాజపత్రం జారీ చేసారు...

తెలుగు ఆనకట్టల దురాక్రమణ చెల్లదు

న్యాయాన్యాయాలు ఆలోచించకుండా ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో కృష్ణా గోదావరి నదులపై అన్ని ప్రాజెక్టులను స్వాధీనం చేయాలని ఆదేశిస్తూ ఢిల్లీ ప్రభువులు రాజపత్రం జారీ చేసారు. కనీసం సాధ్యాసాధ్యాలను కూడా కేంద్రం ఆలోచించలేదు. 


ఉభయ తెలుగు రాష్ట్రాలకు తీవ్ర చిక్కులు తెచ్చిపెడుతూ జలశక్తి మంత్రిత్వశాఖ (నీటి వనరులు, నదుల అభివృద్ధి, గంగా పునరుజ్జీవ విభాగం) గత జూలై 15న న్యూఢిల్లీ నుంచి నెం.ఎస్‌.ఒ.2842 (ఇ) పేరుతో ఒక నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఏడేళ్ళ తమ పాలనకు అనుగుణంగానే కేంద్రం ఇక్కడ తన అధికార పరిధిని నిర్ణయించింది. అంటే వారి ఉద్దేశం ప్రకారం ఇక్కడ ‘అధికార పరిధి’ అంటే అర్థం. హైడల్‌ జనరేషన్‌తో సహా అన్ని ప్రాజెక్టుల నిర్వహణను బదిలీ చేయడమే. కేవలం బదిలీ మాత్రమే కాదు మొత్తం ఈ ఆస్తులను ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల నుంచి అపహరించి తన నియంత్రణలోకి తెచ్చుకుంటోంది. నదీ జలాల నిర్వహణ బోర్డుల పేరుతో ఈ జలాక్రమణకు పాల్పడింది. జీవనదులను, వాటిపై ఆనకట్టలను, వాటికింద ఆయకట్టులను కాపాడుకోలేకపోతే తెలుగు రాష్ట్రాల సార్వభౌమత్వానికే అవమానం.


కృష్ణ, గోదావరి నదీ జలాల నిర్వహణ బోర్డులు (కెఆర్‌ఎంబి, జిఆర్‌ఎంబి) అధికార పరిధిని నిర్వచించే సాకుతో నోటిఫికేషన్‌ జారీ చేసిన కేంద్రం రాష్ట్రాలకు ఉన్న అన్ని అధికారాలనూ, వారి పాలనాశక్తిని లాగేసుకుంది. వాటిని బోర్డులకు అప్పగించింది. అన్ని సాగు నీటి ప్రాజెక్టుల (కృష్ణా ప్రాంతంలోని 35, గోదావరి పరిధిలోని 71)పై  రాష్ట్రాలకు ఉన్న అన్ని రకాల అధికారాలను కేంద్రం మింగేయడంపై ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయంలో రాష్ట్రాలకు ఎలాంటి అధికారాలను మిగల్చని కేంద్రం వాటి మీద బాధ్యతలను మాత్రం మోపడం విచిత్రం. బోర్డులకు ఛైర్మన్‌లను నియమించడం లేదా ఇవి ఎలాంటి కార్యకలాపాలు చేపట్టకుండా రెండు రాష్ట్రాలకు చెందిన ఇంజినీర్లు, సిబ్బందిని అనర్హులుగా ప్రకటించిన ఈ నోటిఫికేషన్‌ ఈ అధికారులను నియమించే అధికారాన్ని కేవలం కేంద్రానికి కట్టబెట్టింది. అంటే కృష్ణా, గోదావరి జలాలు ఇక కేంద్రంలోని పెద్దలు, వారి కనుసన్నల్లో మెలిగే ఇంజినీర్ల సొంతమన్నమాట. వారి రాజకీయ బాస్‌ల ఇష్టానుసారం ఇక చర్యలు ఉంటాయనుకోవాలా?. రెండు ప్రధానమైన నదులపై నియంత్రణను కేంద్రం గుప్పిట్లో పెట్టుకోనుంది. నదులపై, నీటిపై, రాష్ట్రాలకు హక్కులు ఇక గుండు సున్నాయేనా?


సమర్థంగా పని చేసేందుకుగాను బోర్డులకు ప్రారంభ నిధిగా రూ.400 కోట్లు చొప్పున డిపాజిట్‌ చేయాలని రాష్ట్రాలను ఆదేశించింది. అవసరమైన అదనపు నిధులను బోర్డులు డిమాండ్‌ చేసిన 15 రోజుల్లోగా ఇవ్వాలని కూడా గెజిట్ పేర్కొంది.


ఈ ప్రాజెక్టుల కోసం సుదీర్ఘకాలంగా లక్షల కోట్ల రూపాయలను ఖర్చు చేసిన రాష్ట్రాలు ఇప్పుడు తమ సొమ్మును, సిబ్బందిని, ఆస్తులను, ప్రాజెక్టులను, నిర్వహణా అధికారాలను, నియంత్రణను అన్నింటినీ వదులుకోవాల్సిందే.


అధికారాలన్నీ కేంద్రానికి, అన్ని బాధ్యతలు లేదా అప్పులు మాత్రం రాష్ట్రాలకి. ప్రాజెక్టుల నిర్వహణ కోసం రెండు రాష్ట్రాలకు ఎలాంటి ఆదేశాలనైనా ఇచ్చే అధికారం రెండు బోర్డులకూ ఉందట. వాటికి రాష్ట్రాలు తలొగ్గడం తప్ప చేసేదేమీ లేదట. తమ ఆదేశాలను అమలు చేసేందుకు బోర్డులకు పూర్తి అధికారాలను ఇచ్చారట.


‘‘ప్లాంట్‌కు సంబంధించిన యంత్ర పరికరాలు, స్టోర్స్‌, వాహనాలు మొదలైన ఆస్తులన్నీ కెఆర్‌ఎంబి, జిఆర్‌ఎంబీకే చెందుతాయి. ఈ కెఆర్‌ఎంబి, జిఆర్‌ఎంబీ అధికార పరిధికి సంబంధించి ఎలాంటి సందేహం తలెత్తినా కేంద్రం నిర్ణయమే అంతిమం’’ అని ఈ నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ఆమోదం లభించని ప్రాజెక్టులకు ఆరు నెలల్లోగా ఆమోదం సాధించేందుకు రాష్ట్రాలు ప్రయత్నించాలి. ఆమోదం లభించని అన్ని ప్రాజెక్టుల్లోనూ కొనసాగుతున్న పనులను రెండు రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే నిలిపివేయాలి. ఆరు నెలల్లోగా ఆమోదం లభించకపోతే ఈ ప్రాజెక్టులు పనిచేయకుండా ఆపేయాలి. రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులు కారణమైనప్పటికీ అన్ని అనామోదిత ప్రాజెక్టులను నిలిపివేయక తప్పదు. కేంద్రం వీటికి ఎలాంటి బాధ్యత వహించదు అని ఈ గెజిట్ నిరంకుశంగా నిర్దేశిస్తున్నది.


కేంద్రానికి ఈ పెత్తనాన్ని కట్టబెడుతున్నది ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం–2014 అని అంటున్నారు. ఈ చట్టం ప్రకారం కేంద్రానికి రెండు నదీ జల బోర్డుల ఏర్పాటుకు, వాటి అధికార పరిధిని నిర్ణయించేందుకు అవకాశం ఉంది. ఇక్కడ గమనించాల్సిన విషయమేమంటే ఈ బోర్డులు 2014లోనే ఏర్పడ్డాయి కానీ వాటి అధికార పరిధి గురించిన ఆలోచనలు మాత్రం 2020లో మాత్రమే పొడసూపాయి. ఈ చట్టంలో ఎక్కడా నదులను, వాటిపై ప్రాజెక్టులను ఢిల్లీకి అప్పగించాలని కానీ, ఢిల్లీకి ఆ విపరీత అధికారాలున్నాయని కానీ ఎక్కడా చెప్పలేదు. ఈ రాజపత్రం ప్రకారం ఇక రాష్ట్రాలు తమ సార్వభౌమాధికారాన్ని ఢిల్లీ చక్రవర్తి పాదాల ముందు అన్యాక్రాంతం చేయాల్సిందేనట. ఏ రాష్ట్రంలోనూ ఏ నదీమీద చేయని దౌర్జన్యం తెలుగు జీవనదులమీద సాగించడం దురదృష్టకరం.


ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఈ దురాక్రమణ గెజిట్ తీవ్ర జలసంక్షోభం సృష్టించే ప్రమాదం ఉంది. తెలంగాణ రాష్ట్రం తొమ్మిది ప్రాజెక్టులను చేపట్టింది, అందులో నాలుగు దాదాపుగా పూర్తయినాయి. 36 లక్షల 53వేల ఎకరాల ఆయకట్టు అందుబాటులోకి వచ్చేందుకు ఈ ప్రాజెక్టులను చేపట్టింది. ఇప్పటికి 7 లక్షల 53 వేల ఎకరాలకు నీరు అందుతున్నది. ఈ గెజిట్ వల్ల మొత్తం అన్ని ప్రాజెక్టులు ఎక్కడికక్కడ నిలిచిపోవాల్సిందే. మొత్తం 70 వేల కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్టులు నిర్మాణమవుతున్నాయి. అందులో రూ.37 వేల కోట్లు ఖర్చుచేసిన తరువాత కేంద్రం ఈ ప్రాజెక్టులన్నీ నాకిచ్చేయ్, నోరుమూసుకొని పక్కకు తప్పుకో అంటే ఏమన్నట్టు? వాహనాలు, పనిముట్లు, కార్యాలయాలు, కాగితాలు, భవనాలు, ఉద్యోగులు అన్నీ వారికి అప్పగించాలట. ఈ ప్రాజెక్టుల నిర్వహణకు ఏడాదికి 200 కోట్ల రూపాయల చొప్పున చెల్లించాలట. దారుణం అంతటితో ఆగలేదు. కేంద్రం అనుమతి లేని ప్రాజెక్టులు ఎక్కడికక్కడే నిలిపివేస్తారట. అంటే 37 వేలకోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టిన తెలంగాణ ప్రాజెక్టులను స్వాధీనం చేసుకుని కేంద్రం వాటిని నిలిపివేస్తుందన్నమాట. వారే అనుమతించాల్సిన బాధ్యత వదిలేసి, నువ్వే మా దగ్గరనుంచి అనుమతులు తెచ్చుకో అనడం, లేకపోతే ప్రాజెక్టులు ఆగిపోతాయనడం శత్రువులైనా చేస్తారా? అందువల్ల ఏడున్నర లక్షల ఎకరాలకు నీరు అందకపోతే వచ్చే సంక్షోభాన్ని ఎవరు ఎదుర్కొంటారు? సగంలో ఆగిన ప్రాజెక్టులను మళ్లీ ఎవరు పూర్తి చేస్తారు? వాటిపై పెట్టిన ఖర్చులు ఎవరు భరిస్తారు? వీటికోసం తెచ్చిన అప్పులు ఎవరు తీర్చుతారు?


ఈ ప్రాజెక్టులు కేవలం సాగునీటికోసమే కాదు. 12 జిల్లాలలో కోటి 80 లక్షల మందికి తాగు నీరు కూడా ఇస్తున్నాయి. ఇవి ఆగిపోతే, తాగే నీళ్లుకూడా రావు. ఇంతెందుకు, మన భాగ్యనగరానికి తాగు నీళ్లిచ్చే ప్రాజెక్టులు కూడా ఆగిపోతే నగరవాసులకు తాగడానికి నీళ్లుండవు. అప్పుడు ఢిల్లీ నుంచి తాగే నీటి టాంకర్లు పంపిస్తారా? ఆయా ప్రాజెక్టులకోసం లక్షా 20 వేల ఎకరాల భూములకు నష్టపరిహారం ఇచ్చి సేకరించి పెట్టుకున్నారు. వీటిని ఏం చేయాలో గెజిట్‌లో లేదు.


రాజ్యాంగంలో అధికారాల విభజన ప్రకారం నీళ్లు రాష్ట్రాల అంశం. కానీ కేంద్రం ఉమ్మడి జాబితాలోని అంతర్రాష్ట్ర నదుల అంశంపైన ఉభయులకు ఉండే పరిధిని వాడుకుంటూ, ఏపీ పునర్విభజన చట్టం–2014లోని నియమాలకు వక్రభాష్యం చెబుతోంది. నదీ జలాల పంపిణీ అంశాలను కేంద్రం తన స్వాధీనంలోకి తెచ్చుకుంటూ నోటిఫికేషన్లు జారీ చేసింది. కేంద్రం, రాష్ట్రాల మధ్య అధికారాల పంపిణీలోని సాధారణ సూత్రాలకు వ్యతిరేకంగా తమ రాష్ట్రాలలోని నదుల నీటి నిర్వహణలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు ఉన్న స్వతంత్ర ప్రతిపత్తిని హరించి వేసింది. తెలుగు రాష్ట్రాల్లోని కృష్ణా, గోదావరి జలాలను కేంద్రంలోని అధికారుల చేతిలో పెడుతూ చేసిన ప్రకటనతో రాజ్యాంగ మౌలిక లక్షణమైన సమాఖ్య సూత్రం నీటి మూట అయ్యింది.


ఆంధ్ర, తెలంగాణ ఉప ప్రాంతాల మధ్య కృష్ణా గోదావరి నదీ జలాల అసమాన పంపిణీకి వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు అర్ధ శతాబ్దానికి పైగా ఆందోళనలు చేస్తున్నారు. నీటి కేటాయింపుల్లో అన్యాయానికి వ్యతిరేకంగా ఫిర్యాదు చేసేందుకు కేవలం ఒక రాష్ట్రానికే అధికారం ఉంటుందని రాజ్యాంగం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని 10 తెలంగాణ జిల్లాలకు చట్టబద్ధమైన అవకాశం (సామర్థ్యం) లేనందున ప్రత్యేక తెలంగాణ డిమాండ్‌ మరింత బలపడింది. తెలంగాణ రాష్ట్రం డిమాండ్‌ వెనకనున్న రాజ్యాంగబద్ధ అవసరాన్ని గురించి జస్టిస్‌ శ్రీకృష్ణ కమిటీకి నేను వ్యక్తిగతంగా తెలియజేశాను. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ శ్రీకృష్ణ, నల్సార్‌ విసి ప్రొఫెసర్‌ రణబీర్‌ సింగ్‌ ఈ విషయంపై అనేక ప్రశ్నలు అడిగారు. అంతర్‌రాష్ట్ర నదీ జలాల వివాదాన్ని రాజ్యాంగబద్ధంగా కేవలం ఒక రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే లేవనెత్తగలదు. రాష్ట్రం మాత్రమే సుప్రీంకోర్టు న్యాయ పరిధిలో సహాయాన్ని కోరగలదు. కృష్ణ లేదా గోదావరి జలాల వివాదం ట్రిబ్యునల్‌కు వెళ్ళేందుకు సాంకేతికంగా ఒక ఉప ప్రాంతానికి సాధ్యం కాదు.


తెలంగాణలో 70 శాతం కృష్ణా జలాలు ప్రవహిస్తుంటే 50 శాతం వాటా కూడా ఇవ్వరా? ఇది రాజ్యాంగంలోని అధికరణలు 21, 14 ప్రకారం సమానత్వానికి సంబంధించిన అంశం. ఈ రెండు నదులు ప్రవహిస్తున్న అన్ని రాష్ట్రాల మధ్య వాటాలను పునఃకేటాయించాలి. కనీసం ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల మధ్య నదీజలాల వాటాలు నిర్ణయించరు. ప్రాజెక్టులను అనుమతించరు. ట్రిబ్యునల్ వేయరు. నీటి కేటాయింపులు చేయరు. ప్రాజెక్టులు కట్టనీయరు. పూర్తయిన ప్రాజెక్టులు ఆపేస్తారు. సగంలో ఉన్నవి సాగనీయరు. సాగునీరు పారనీయరు, తాగునీరు రానీయరు. రాష్ట్రాల హక్కులను కాలరాస్తారు. ఇదెక్కడి న్యాయం? ఈ దౌర్జన్యపు గెజిట్ ఉపసంహరింపజేసేందుకు తెలుగు ప్రజలు జాగృతం కావాలని తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరం కోరుతున్నది. తెలుగు ప్రజలు తీవ్రంగా ఆలోచించవలసిన తీవ్ర జల సంక్షోభం ఇది.

మాడభూషి శ్రీధర్

Updated Date - 2022-03-04T06:56:47+05:30 IST