‘పది’లోనూ బాలికలదే హవా
ABN , First Publish Date - 2022-07-01T07:08:40+05:30 IST
ప్రభుత్వం గురువారం విడుదలచేసిన పదో తరగతి పరీక్షా ఫలితాల్లో బాలికలు సత్తా చాటారు. బాలికలు 94.86శాతం ఉత్తీర్ణత సాధించారు.
94.86శాతం ఉత్తీర్ణత
బాలుర ఉత్తీర్ణత శాతం 92.31
జిల్లా ఉత్తీర్ణత 93శాతం
రాష్ట్రస్థాయిలో 13వ స్థానం
90పాఠశాలల్లో నూరు శాతం ఉత్తీర్ణత
111మంది విద్యార్థులకు 10జీపీఏ
భువనగిరి టౌన్, జూన్ 30: ప్రభుత్వం గురువారం విడుదలచేసిన పదో తరగతి పరీక్షా ఫలితాల్లో బాలికలు సత్తా చాటారు. బాలికలు 94.86శాతం ఉత్తీర్ణత సాధించారు. కాగా, మొత్తం 93శాతం ఉత్తీర్ణతతో జిల్లా రాష్ట్రస్థాయిలో 13వ స్థానంలో నిలిచింది. కొవిడ్-19 కారణంగా రెండు విద్యా సంవత్సరాలు పరీక్షలు రాయకుండానే పైతరగతులకు ప్రమోట్ అవుతూ వచ్చిన విద్యార్థులు, పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించడం విశేషం. జిల్లాలో 266 ప్రభుత్వ, ప్రైవేటు, రెసిడెన్షియల్ పాఠశాలల నుంచి మొత్తం 9,400మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా, 8,799 (93.61శాతం)మంది ఉత్తీర్ణత సాధించారు. 601మంది ఫెయిల్ అయ్యారు. 4615 మంది బాలురకు 4260మంది (92.31శాతం) ఉత్తీర్ణులయ్యారు. పరీక్షలకు 4785మంది బాలికలు హాజరు కాగా, 4539మంది (94.86శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. జిల్లాలోని 90 పాఠశాలలు నూరుశాతం ఉత్తీర్ణత సాధించగా, 111మంది విద్యార్థులు 10జీపీఏ సాధించారు. కాగా, ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను కలెక్టర్ పమేలా సత్పథి, డీఈవో సత్యనారాయణరెడ్డి అభినందించారు.
ఉమ్మడి జిల్లాలో
సూర్యాపేట జిల్లాలో మొత్తం 12,443 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, 11,572 మంది ఉత్తీర్ణత సాధించారు. జిల్లా 93.05శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రస్థాయిలో 16వ ర్యాంకు సాధించింది. బాలురు 6,347 మందికి 5,773మంది(90.96శాతం) ఉత్తీర్ణులయ్యారు. బాలికలు 6,096 మందికి 5,799 మంది(95.13శాతం) ఉత్తీర్ణులయ్యారు. మొత్తం మీద బాలికలే పైచేయి సాధించారు. నల్లగొండ జిల్లాలో 19,747 మంది విద్యార్థులకు 18,477మంది (93.57శాతం) ఉత్తీర్ణులయ్యారు. రాష్ట్రస్థాయిలో 14వ స్థానంలో నిలిచింది. 10,273 మంది బాలురు పరీక్షలు రాయగా 9,456మంది(92.05శాతం) ఉత్తీర్ణులయ్యారు. 9,474 మంది బాలికలకు 9021 మంది(95.22శాతం) ఉత్తీర్ణత సాధించారు. బాలికలే టాప్గా నిలిచారు.
తడ‘బడి’నా ఉత్తమ ఫలితాలు
కోదాడ: విద్యారంగంపై కరోనా ప్రత్యక్ష ప్రభావం చూపినా పదో తరగతిలో విద్యార్థులు ఉత్తమ ప్రతిభ చాటారు. కరోనా నేపథ్యంలో 2019-20, 2000-21 విద్యాసంవత్సరానికి విద్యార్థులు పూర్తిగా దూరమయ్యారు. పదో తరగతి వార్షిక పరీక్షలు లేకుండానే విద్యార్థులను ప్రభుత్వం అందరినీ ఉత్తీర్ణులను చేసింది. ఇదిలా ఉంటే 2021-22 విద్యాసంవత్సరంలో సైతం కరోనా పాక్షికంగా ప్రభావం చూపింది. కాగా, 2019-20లో 8తరగతి విద్యార్థులు 9వ తరగతికి, ఆ తరువాత 2020-21లో 9వ తరగతి నుంచి పదోతరగతికి క్లాస్లు సరిగా జరగకుండా, పరీక్షలు లేకుండా ప్రమోట్ అయ్యారు. అయితే ఓ పక్క కరోనా భయం, మరో పక్క క్లాసులు ఆన్లైన్, ఆఫ్లైన్, వారిక్ష పరీక్షలు ఉంటాయో లేదో అనే ఒత్తిడితో విద్యార్థులు చివరకు పదో తరగతి వార్షిక పరీక్షలకు హాజరై మెరుగైన ఫలితాలు సాధించారు. ఇక పూర్తిస్థాయిలో ఎఫ్ఐ (ఫార్మెటివ్ అసె్సమెంట్), ఎస్ఏ (సమ్మెటివ్ అసె్సమెంట్) పరీక్షలు లేకుండానే పది విద్యార్థులకు వారి ప్రతిభ ఆధారంగా 20 ఇంటర్నల్ మార్కులను ఉపాధ్యాయులు కేటాయించారు.
తగ్గిన సిలబస్, పేపర్లు
గత విద్యాసంవత్సరంలో కరోనా నేపథ్యంలో తొలుత తరగతుల నిర్వహణపై స్పష్టతలేక విద్యార్థులు గందరగోళానికి గురయ్యారు. అకడమిక్ క్యాలెండర్పైనా స్పష్టత లేదు. చివరికి జూన్ నుంచి సెప్టెంబరు నెల వరకు ఆన్లైన్లో, అక్టోబరు నుంచి ఆఫ్లైన్లో తరగతులు నిర్వహించారు. ఈ క్రమంలో ప్రభుత్వం సిలబస్ను 70శాతానికి తగ్గించింది. అంతేగాక గతంలో 11 పేపర్లు ఉండగా, 6 పేపర్లకు కుదించింది. సిలబస్, పేపర్లు తగ్గడం, ఛాయిస్ బేస్డ్ ప్రశ్నలు పెరగడంతో విద్యార్థులు ఒత్తిడిని అధిగమించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. దీంతో ఉత్తమ ఫలితాలు సాధించారు.
ఆరేళ్లుగా పదో తరగతి ఫలితాలు
సంవత్సరం హాజరు ఉత్తీర్ణత శాతం జిల్లా
స్థానం
2016-17 10,228 8,280 80.95 25వ
2017-18 9632 7993 82.98 19వ
2018-19 9678 9249 95.57 16వ
2019-20 10,064 10,064 100 -
2020-21 10,087 10,087 100 -
2021-22 9400 8799 93.61 13వ
యాజమాన్యాల వారీగా ఫలితాలు
యాజమాన్యం పాఠశాలలు హాజరు ఉత్తీర్ణత శాతం 10జీపీఏ నూరుశాతం
విద్యార్థులు పాఠశాలలు
జడ్పీహెచ్ఎస్ 152 4,232 3,773 89.15 4 43
ప్రభుత్వ 6 261 200 76.63 - -
కేజీబీవీ 11 398 362 90.95 - 1
మోడల్ స్కూల్ 7 660 639 96.82 3 1
ఎయిడెడ్ 1 3 3 100 - 1
ఆశ్రమ 1 23 13 56.52 - -
బీసీ వెల్ఫేర్ 2 158 156 98.73 12 1
రెసిడెన్షియల్ 3 283 280 98.94 25 2
మైనార్టీ 3 41 136 96.45 1 1
సోషల్ వెల్ఫేర్ 7 553 547 98.92 6 3
ప్రైవేట్ పాఠశాలలు 73 2,765 2,690 97.29 60 37
మొత్తం 266 9,477 8799 93.00 111 90