నాలుగు కేంద్రాల్లో ముగిసిన వేలం

ABN , First Publish Date - 2022-06-23T06:42:41+05:30 IST

దక్షిణాది పొగాకు మార్కెట్‌ ముగింపు దశకు చేరుకుంటోంది. ఈ ప్రాంతంలోని మొత్తం 11 కేంద్రాల్లో నాలుగు చోట్ల వేలం ముగిసింది.

నాలుగు కేంద్రాల్లో ముగిసిన వేలం

పదిరోజుల క్రితమే మూడింటిలో,  తాజాగా పొదిలిలో పూర్తి

దక్షిణాదిలో పండిన పొగాకులో 85శాతానికిపైగా అమ్మకాలు

కిలోకు రూ.171పైన లభించిన సగటు ధర

వచ్చేనెల 15కు మొత్తం పూర్తికి చర్యలు

ఒంగోలు, జూన్‌ 22 (ఆంధ్రజ్యోతి) : దక్షిణాది పొగాకు మార్కెట్‌ ముగింపు దశకు చేరుకుంటోంది. ఈ ప్రాంతంలోని మొత్తం 11 కేంద్రాల్లో నాలుగు చోట్ల వేలం ముగిసింది. దక్షిణాదిలో పండిన పంటలో 85శాతానికిపైగా అమ్మకాలు పూర్తి కాగా సగటున కిలోకు రూ.171కిపైగా ధర లభించింది. మిగిలిన 15శాతం పంటను రానున్న పక్షంరోజుల్లో కొనుగోలు చేసే అవకాశం ఉన్నప్పటికీ పలుకేంద్రాల్లో గోడౌన్లు నిండిపోవడంతో రోజువారీ బేళ్ల సంఖ్య కొద్దిగా తగ్గుతూ వస్తోంది. ఏమైనా వచ్చేనెల 15నాటికి మొత్తం దక్షిణాదిలో ఈసీజన్‌ పొగాకు వేలం ప్రక్రియ పూర్తికి బోర్డు అధికారులు షెడ్యూల్‌ సిద్ధం చేశారు. దక్షిణాదిలోని 11 వేలం కేంద్రాల్లో 80.72 మిలియన్‌ కిలోలను 2021-22 సీజన్‌లో పంట ఉత్పత్తికి పొగాకు బోర్డు అనుమతి ఇచ్చింది. దాదాపు 73.06 మిలియన్‌ కిలోలు ఉత్పత్తి జరిగినట్లు అంచనా వేశారు. మార్కెట్‌ ఒడిదొడుకులు లేకుండా సజావుగా కొనసాగడంతో వేగంగానే ప్రక్రియ నడుస్తోంది. అలా ఇప్పటివరకు 62.50 మిలియన్‌ కిలోలు కొనుగోళ్లు జరగ్గా ఇంచుమించు కిలోకు రూ.171.20 మేర సగటు ధర లభించింది.


తక్కువ రకానికి అనూహ్యంగా గిరాకీ

గతంలో ధరలు సరిలేక, అసలు కొనుగోళ్లు సరిగా ఉండని బ్రౌన్‌, పచ్చ అలాగే మీడియంలో నాణ్యత తక్కువ ఉండే గ్రేడ్‌లకు ఈ ఏడాది అనూహ్యంగా మేలురకంతో పోటీపడే స్థాయిలో ధరలు లభించడంతో వేగంగా వేలం సాగింది. ఈ నేపథ్యంలో కనిగిరి, డీసీపల్లి, కలిగిరి కేంద్రాల్లో పది రోజుల క్రితమే కొనుగోళ్లు ముగిశాయి. బుధవారంతో పొదిలి  కేంద్రంలోనూ పూర్తయ్యింది. పొదిలిలో 80 రోజుల్లో 6.75 మిలియన్‌ కిలోల పొగాకు కొనుగోళ్లు జరగ్గా సగటున కిలోకు రూ.167.26 ధర లభించింది. అక్కడ గత సీజన్‌ కన్నా సగటు ధర కిలోకు రూ.30కిపైగా లభించినట్లు సమాచారం. ఇదిలా ఉండగా మరో 7 వేలంకేంద్రాల పరిధిలో ఇంకా 11 మిలియన్‌ కిలోల వరకు ఇంకా కొనుగోలు చేయాల్సి ఉంది.  


గోదాములు నిండిపోవడంతో..

వాస్తవానికి ప్రస్తుత మార్కెట్‌ పోకడ ప్రకారం అయి తే ఇంకో పది రోజుల్లోనే వేలం పూర్తి కావాల్సి ఉంది. అయితే కొంతమంది ఎగుమతిదారులు భారీగా వేలం కేంద్రాల నుంచి బేళ్లను తీసుకెళ్లలేకపోతున్నారు. ఆయా కేంద్రాల్లోని గోడౌన్లు నిండిపోతున్నాయి. దీంతో రోజువారీ వేలానికి అనుమతించే బేళ్లను బోర్డు అధికారులు తగ్గిస్తున్నారు. అలాగే కొన్నిచోట్ల వేలం కూడా వారంలో రెండేసి రోజులు నిలుపుదల చేస్తున్నారు. ఒంగోలు-1 కేంద్రంలో ప్రస్తుతం రెండు రోజులుగా అలా వేలం నిలిచిపోయింది. దీంతో వచ్చేనెల 15నాటికి వేలం ప్రక్రియ పూర్తయ్యేలా చర్యలు చేపట్టారు. 


Updated Date - 2022-06-23T06:42:41+05:30 IST