Congress Vs Smriti Irani : పోర్చుగీసు చట్టాన్ని ప్రస్తావించిన బార్ ఓనర్

ABN , First Publish Date - 2022-07-31T01:29:33+05:30 IST

ఉత్తర గోవా (North Goa)లోని ఓ బార్ యాజమాన్య హక్కుల

Congress Vs Smriti Irani : పోర్చుగీసు చట్టాన్ని ప్రస్తావించిన బార్ ఓనర్

పనజీ : ఉత్తర గోవా (North Goa)లోని ఓ బార్ యాజమాన్య హక్కుల విషయంలో పోర్చుగీసు కాలం నాటి చట్టాన్ని ప్రస్తావించారు. ఈ బార్‌తో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ (Smriti Irani) కుమార్తెకు సంబంధం ఉందని ఇటీవల కాంగ్రెస్ (Congress) ఆరోపించింది. అయితే ఈ బార్ పూర్తిగా తమదేనని, దీనిలో ఇతరుల భాగస్వామ్యం లేదని ఆ బార్ యజమాని తెలిపారు. 


ఉత్తర గోవాలోని అస్సగావ్ గ్రామంలో సిల్లీ సోల్స్ కెఫే అండ్ బార్ (Silly Souls Cafe and Bar) ఉంది. ఈ రెస్టారెంట్‌ను నడపటానికి లైసెన్సును చట్టవిరుద్ధంగా సంపాదించారని సామాజిక ఉద్యమకారుడు, న్యాయవాది ఐరెస్ రోడ్రిగ్స్ (Aires Rodrigues) ఎక్సయిజ్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. 2021లో మరణించిన వ్యక్తి పేరు మీద ఈ సంవత్సరం (2022లో) రెన్యువల్ చేయించారని ఆరోపించారు. ఈ బార్‌తో స్మృతి ఇరానీ కుమార్తెకు సంబంధం ఉందని ఇటీవల కాంగ్రెస్ ఆరోపించింది. అయితే ఈ ఆరోపణలను స్మృతి ఖండించారు. 


రోడ్రిగ్స్ ఫిర్యాదుపై రాష్ట్ర ఎక్సయిజ్ కమిషనర్ నారాయణ్ గడ్ శుక్రవారం విచారణ జరిపారు. ఈ బార్ అండ్ రెస్టారెంట్‌ లైసెన్స్ ఆంథోనీ డిగమ పేరు మీద ఉంది. డిగమ కుటుంబ సభ్యులు ఈ విచారణకు హాజరయ్యారు. ఇది పూర్తిగా తమ వ్యాపారమేనని, దీనిలో ఇతరుల ప్రమేయం లేదని తెలిపారు. 


డిగమ కుటుంబ సభ్యుల తరపున వాదనలు వినిపించిన న్యాయవాది బెన్నీ నజరేత్ విచారణ ముగిసిన తర్వాత విలేకర్లతో మాట్లాడుతూ, పోర్చుగీసు సివిల్ కోడ్ ప్రకారం భార్యాభర్తల్లో ఒకరు మరణిస్తే, మృతుని హక్కులు, అధికారాలు అతని లేదా ఆమె జీవిత భాగస్వామి (భార్య లేదా భర్త)కు బదిలీ అవుతాయని చెప్పారు. ఆంథోనీ మరణించిన తర్వాత ఆయన కుటుంబ సభ్యులు బార్ లైసెన్స్ రెన్యువల్ కోసం దరఖాస్తు చేశారని తెలిపారు. గోవాలో పోర్చుగీసు సివిల్ కోడ్ ఇప్పటికీ అమల్లో ఉందన్నారు. 


రోడ్రిగ్స్ మాట్లాడుతూ, ఆంథోనీ మరణానంతరం ఓ ఏడాది గడచిన తర్వాత బార్ లైసెన్స్ రెన్యువల్ కోసం దరఖాస్తు చేశారని చెప్పారు. 


Updated Date - 2022-07-31T01:29:33+05:30 IST