పెద్దగట్టు జనసంద్రం
ABN , First Publish Date - 2021-03-01T09:55:59+05:30 IST
నెత్తిన బోనంతో కటారీలు చేతబూని, భేరీలు మోగించారు.. కాళ్లకు గజ్జెలు కట్టి నృత్యాలు చేస్తూ స్వామికి బోనాలు సమర్పించారు.
కోలాహలంగా లింగమయ్య జాతర ఆరంభం
గుట్టకు చేరుకున్న మకరతోరణం, పసిడికుండ
చివ్వెంల ఫిబ్రవరి 28: నెత్తిన బోనంతో కటారీలు చేతబూని, భేరీలు మోగించారు.. కాళ్లకు గజ్జెలు కట్టి నృత్యాలు చేస్తూ స్వామికి బోనాలు సమర్పించారు. ఓ లింగా.. ఓ లింగా అంటూ గుడి చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణలు చేశారు. ఇలా.. సూర్యాపేటలోని దురాజ్పల్లి లింగమంతుల స్వామి (పెదగట్టు) జాతర ఆదివారం అర్ధరాత్రి ఘనంగా ప్రారంభమైంది. మంత్రి జగదీశ్రెడ్డి దేవరపెట్టెను కదిలించి, సంప్రదాయబద్ధంగా జాతరను ఆరంభించారు. ఉదయం నుంచేసూర్యాపేట, పరిసర ప్రాం తాల భక్తులు లింగమంతులస్వామి, ఆకుమంచమ్మ, యలమంచమ్మ, సౌడమ్మ దేవతలను దర్శించుకున్నారు. మధ్యాహ్నం సూర్యాపేట గొల్లబజార్లోని యాదవుల కుల దేవాలయం నుంచి కటారీ విన్యాసాల మధ్య సంప్రదాయబద్ధంగా మకర తోరణాన్ని గుట్టకు తరలించారు. జాతర తొలి రోజు గట్టుపైకి చేర్చే పసిడికుండను ఆదివారం ఖాసీంపేటకు చెందిన అలిశెట్టి వంశస్థులు డప్పుచప్పుళ్లు, కటారీల విన్యాసాలతో పెద్దగట్టుపైకి చేర్చారు. సోమవారం తెల్లవారుజాము నుంచి భక్తులు బోనా న్ని చెల్లిస్తారు. సోమవారం ఆరు లక్షలకు పైగా భక్తులు హాజరవుతారని అంచనా.