భారం ‘తగ్గించారు’!
ABN , First Publish Date - 2022-05-22T06:39:00+05:30 IST
పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
- పెట్రోల్పై రూ.8, డీజిల్పై రూ.6 ...
- పీఎం ఉజ్వల్ యోజన గ్యాస్ కనెక్షన్లపై రూ.200 తగ్గింపు
- వినియోగదారులకు ఊరట
కర్నూలు(కలెక్టరేట్), మే 21: పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో సామాన్యుడికి కొంత మేర ఊరట లభించినట్లయింది. పెట్రోల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. వీటి ప్రభావం ఇతర వినియోగ వస్తువులు, నిత్యావసరాలపై పడింది. వాటి ధరలూ ఒక్కసారిగా పెరిగాయి. దీంతో సామాన్యులు విలవిల్లాడిపోయారు. ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో కొంత భారం తగ్గించినట్లయింది. ప్రస్తుతం పెట్రోల్ ధర రూ.119, డీజిల్ రూ.108 ఉంది. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్పై రూ.8, డీజిల్పై రూ.7ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. దీంతో పెట్రోల్ పై రూ.9.5, డీజిల్ పై రూ.8 తగ్గుతుంది. దీని ప్రకారం పెట్రోల్ రూ.109.5, డీజిల్ రూ.100కు తగ్గే అవకాశం ఉంది. అలాగే గ్యాస్ ధరలు కూడా తగ్గాయి. ఇది పీఎం ఉజ్వల యోజన గ్యాస్ కనెక్షన్ ఉన్న వినియోగదారులకే వర్తిస్తుందని కేంద్రం ప్రకటించింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో దాదాపు 12 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో దాదాపు 2 లక్షల వరకు పీఎం ఉజ్వల యోజన గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. దీంతో 2 లక్షల మంది లబ్ధిదారులకు రూ.4 కోట్లు ఆదా కానున్నాయి. జిల్లాలో దీపం కనెక్షన్లు అధికంగా ఉన్నాయి. ఈ కనెక్షన్ల ధరలపై సడలింపు లేకపోవడంతో వీరు నిరాశ చెందుతున్నారు.
రోజుకు రూ.179 కోట్లు ఆదా:
ఉమ్మడి జిల్లాలో వివిద చమురు ఏజెన్సీలకు సంబంధించి 330 పెట్రోల్ బంకులు ఉన్నాయి. ఒక్కొక్క పెట్రోల్ బంకులో రోజుకు 1500 నుంచి 2000 లీటర్ల వరకు విక్రయిస్తున్నారు. అలాగే డీజిల్ రోజుకు 2500 నుంచి 3000 లీటర్లు విక్రయిస్తున్నారు. ఈ లెక్కన రోజుకు పెట్రోల్ 5 లక్షల లీటర్లు, డీజిల్ 16.5 లక్షల లీటర్లను వినియోగిస్తున్నారు. ఈ లెక్కన రోజుకు పెట్రోల్పై రూ.47,50,000, డీజిల్పై రూ.1,32,00,000 భారం తగ్గనుంది. పెట్రోల్, డీజిల్లను వినియోగించే దాదాపు 30 లక్షల మంది వాహనదారులకు రూ.1,79,50,000 ఆదా కానుంది.
తగ్గనున్న నిత్యావసర సరుకుల ధరలు:
కేంద్ర ప్రభుత్వం పెట్రో ధరలను తగ్గిస్తున్న నేపథ్యంలో నిత్యావసర సరుకుల ధరలు కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయని వినియోగదారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలతో పాటు ఎరువులు, పప్పులు, ఇతర నిత్యావసర వస్తువుల ధరలు దిగి వచ్చే అవకాశం ఉంది.