డివైడర్‌ను ఢీకొట్టి కారు పల్టీ

ABN , First Publish Date - 2022-08-11T08:43:05+05:30 IST

నిజామాబాద్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ముప్కాల్‌ మండలం కొత్తపల్లి దగ్గర 44వ జాతీయ రహదారిపై ఓ కారు డివైడర్‌ను వేగంగా ఢీకొట్టింది.

డివైడర్‌ను ఢీకొట్టి కారు పల్టీ

నలుగురి మృతి.. ముగ్గురికి గాయాలు

నిజామాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

మృతులంతా ఒకే కుటుంబ సభ్యులు

వార్దాలో ఫంక్షన్‌కు వెళ్తుండగా ఘటన


ముప్కాల్‌, ఆగస్టు 10: నిజామాబాద్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ముప్కాల్‌ మండలం కొత్తపల్లి దగ్గర 44వ జాతీయ రహదారిపై ఓ కారు డివైడర్‌ను వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అక్కడికక్కడే చనిపోయారు. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. బుధవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది.


కారు నడుపుతున్న వ్యక్తి నిద్ర మత్తు, అతివేగం ప్రమాదానికి కారణం కావొచ్చని అనుమానిస్తున్నారు. హైదరాబాద్‌లోని టోలిచౌకికి చెందిన మహ్మద్‌ అంజాద్‌ షేక్‌(32) వ్యాపారి. మహారాష్ట్రలోని వార్దాలో ఫంక్షన్‌కు హాజరు కావడానికి ఆంజాద్‌ షేక్‌, కుటుంబసభ్యులు బుధవారం తెల్లవారుజామున హైదరాబాద్‌ నుంచి రెండు వాహనాల్లో బయల్దేరారు. నిజామాబాద్‌లోని కొత్తపల్లి వద్ద అంజాద్‌ నడుపుతున్న కారు డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. పల్టీలు కొడుతూ అవతలి వైపు రోడ్డు చివర ఆగింది. కారు నడుపుతున్న అంజాద్‌తో పాటు మినహాజ్‌ బేగం(34), ఆమె రెండో కొడుకు హైమద్‌(7), కూతురు ఫీర్జా హమ్దానీ(3) అక్కడికక్కడే చనిపోయారు. కారులో ఉన్న మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.  మరో కారులోని కుటుంబసభ్యులు వారిని ఆస్పత్రికి తరలించారు. 

Updated Date - 2022-08-11T08:43:05+05:30 IST