కేంద్రం రెండు నాలుకల ధోరణి
ABN , First Publish Date - 2022-05-17T06:18:35+05:30 IST
భారత పార్లమెంట్ 2014 జూన్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణను విభజించి నూతన రాష్ట్రంగా ఏర్పాటు చేసింది. దీనితో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విభజించబడింది...
భారత పార్లమెంట్ 2014 జూన్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణను విభజించి నూతన రాష్ట్రంగా ఏర్పాటు చేసింది. దీనితో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విభజించబడింది. 2022 జూన్ నాటికి రెండు రాష్ట్రాలు విడిపోయి దాదాపు ఎనిమిది సంవత్సరాలు కావస్తున్నా నేటికీ విభజన చట్టంలో పేర్కొన్న అనేక అంశాలను కేంద్రం పట్టించుకోవడం లేదు. కేంద్రం పట్టించుకోని అంశాలలో నియోజక వర్గాల పునర్వ్యవస్థీకరణ ఒకటి.
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోని సెక్షన్ 17 ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న 294 ఎమ్మెల్యే స్థానాల విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్కు 175 స్థానాలను, తెలంగాణకు 119 స్థానాలను కేటాయించారు. అలాగే సెక్షన్ 26 ప్రకారం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్న 175 ఎమ్మెల్యే స్థానాలను 225కు, తెలంగాణలో ఉన్న 119 ఎమ్మెల్యే స్థానాలను 153కి పెంచాలి అని విభజన చట్టంలో స్పష్టంగా పేర్కొన్నారు. కేంద్రం మాత్రం శాసనసభ స్థానాలు కానీ, పార్లమెంట్ స్థానాలు కానీ 2026 వరకు మార్చడం కుదరదని ఒకవేళ తెలుగు రాష్ట్రాల శాసనసభ స్థానాలను పెంచాలంటే రాజ్యాంగ సవరణ చెయ్యాలని కుంటి సాకులు చెబుతూ వస్తోంది.
అయితే భారత పార్లమెంట్ 2019 ఆగస్ట్లో రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ని రద్దు చేసి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఏర్పాటు చేసింది. జమ్మూ కాశ్మీర్ని అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతంగా, లడ్డక్ని అసెంబ్లీ లేని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించింది. జస్టిస్ రంజన్ ప్రకాష్ దేశాయ్ అధ్యక్షతన త్రిసభ్య డిలిమిటేషన్ కమిషన్ని కేంద్రం ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ తాజాగా తన నివేదికను ప్రకటించింది. ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్లో 83 శాసనసభ స్థానాలు ఉన్నాయి. వీటిని 90కి పెంచాలని ఈ కమిషన్ పేర్కొంది. ఇప్పటివరకు కాశ్మీర్ డివిజన్లో 46 స్థానాలు, జమ్మూ డివిజన్లో 37 స్థానాలు ఉండేవి. కొత్త ప్రతిపాదన ప్రకారం కాశ్మీర్ డివిజన్లో 47 స్థానాలు, జమ్మూ డివిజన్లో 43 స్థానాలు వస్తాయి. మొత్తం 7 స్థానాల పెరుగుదలను ఈ కమిషన్ సూచించింది.
2014లో విభజించిన తెలుగు రాష్ట్రాలలో నియోజకవర్గాలను పునర్వ్యవస్థీకరణ చెయ్యమంటే 2026 వరకు పెంచకూడదు అని కుంటి సాకులు చెప్పే కేంద్రం 2019లో విభజించిన జమ్మూ కాశ్మీర్ విషయంలో మాత్రం వాళ్ళు అడక్కపోయినా నియోజకవర్గాలను పునర్వ్యవస్థీకరిస్తోంది. అలాగే కొన్ని లక్షల కోట్ల అభివృద్ది ప్రాజెక్టులను జమ్మూ కాశ్మీర్లో ప్రారంభించింది. తెలుగు రాష్ట్రాలకు హక్కుగా రావలసిన వాటిని కేంద్రం కాలరాస్తోంది. కేంద్రం కొన్ని రాష్ట్రాలకు అనుకూలంగా, ఇంకొన్ని రాష్ట్రాల విషయంలో కఠినంగా ఎందుకు ఇంత వైరుద్యం ప్రదర్శిస్తోందో అర్థం కావడం లేదు. తెలుగు రాష్ట్రాల పాలకులు కూడా తమకు హక్కుగా రావలసిన వాటి గురించి గట్టిగా డిమాండ్ చెయ్యడం లేదు. అటు కేంద్ర పాలకులు ఇటు రాష్ట్ర పాలకులు రాష్ట్రం గురించి పట్టించుకోకపోవడం వల్ల రాష్ట్రం అభివృద్ధికి నోచుకోవడం లేదు. కేంద్రం పెద్దన్న పాత్ర పోషించి అన్ని రాష్ట్రాలని సమాన దృష్టితో చూసి ఏ రాష్ట్రానికి రావలసిన వాటిని ఆ రాష్ట్రాలకి ఇచ్చి వాటికి అండగా నిలవాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంది.
కోనేటి నరేష్