చెరువుకు పొంచి ఉన్న ప్రమాదం
ABN , First Publish Date - 2021-07-23T05:27:53+05:30 IST
మండలంలోని కొండమాయపల్లె చిన్నరాజు చెరువుకు ప్రమాదం పొంచి ఉందని రైతులు వాపోతున్నారు.
- రెండు తూముల వద్ద కుంగిన గట్టు
- వర్షపు నీరంతా వృథా
రుద్రవరం, జూలై 22: మండలంలోని కొండమాయపల్లె చిన్నరాజు చెరువుకు ప్రమాదం పొంచి ఉందని రైతులు వాపోతున్నారు. మైనర్ ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రెండు తూముల వద్ద గట్టు కుంగిపోయింది. తూములకు షెట్టర్లు సరిగా లేవు. చెరువుకు చేరిన వర్షపు నీరంతా బయటకు వెళ్లిపోతోంది. వరి నారుమళ్లు సాగు చేసేదెలా అని రైతులు వాపోతున్నారు. ఈ చెరువు కింద ఆయకట్టు, నాన్ ఆయకట్టు సుమారు 200 ఎకరాలుపైబడి ఉందని అన్నారు. ఈ చెరువుకు 2 అలుగులు, 2 తూములు ఉన్నాయి. చెరువు గట్టు కూడా అక్కడక్కడ బలహీనంగా ఉంది. అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. గ్రామానికి చెరువు పైవైపున ఉంది. దీని వల్ల ప్రమాదం పొంచి ఉందని రైతులు, ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
చెరువు నీరంతా వృథాగా పోతోంది
చిన్నరాజు చెరువుకు చేరిన నీరంతా తూము లు సరిగా లేక వృథాగా పోతోంది. ఇలాగైతే ఆయకట్టుసాగు ప్రశ్నార్థకం. ఇలాగైతే వరినారుమళ్లు సాగు చేసేదెలా. వర్షపు నీరంతా వృథాగా పోతోంది.
- మధు, రైతు, కొండమాయపల్లె
అధికారులు కన్నెత్తి చూడటం లేదు
చెరువు తూములు సరిగా లేవని అధికారులకు ఫిర్యాదు చేస్తే కన్నెత్తి చూడటం లేదు. ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. వర్షపు నీరంతా చెరువు నుంచి వృథాగా బయటకు పోతోంది. వరి నారుమళ్లు ఎట్లా సాగు చేయాలి?
- రామప్రతా్ప రెడ్డి, కౌలు రైతు, కొండమాయపల్లె