మా నాన్న మమ్మల్ని లైంగికంగా వేధిస్తున్నాడు.. కాలేజీలో ఫ్రెండ్స్‌కు ఏడుస్తూ చెప్పారా ఇద్దరు యువతులు.. ఆ తర్వాత..

ABN , First Publish Date - 2021-11-24T03:16:56+05:30 IST

బయటి వ్యక్తుల నుంచి సమస్యలు ఎదురైతే అమ్మకో, నాన్నకో చెప్పుకొంటాం. మరి నాన్నే సమస్యగా మారితే ఎవరికి చెప్పుకోవాలి. బెంగళూరులో ఇలాగే జరిగింది.

మా నాన్న మమ్మల్ని లైంగికంగా వేధిస్తున్నాడు.. కాలేజీలో ఫ్రెండ్స్‌కు ఏడుస్తూ చెప్పారా ఇద్దరు యువతులు.. ఆ తర్వాత..

అమ్మాయిలకు అడుగడుగునా సమస్యలు ఎదురవుతుంటాయి. ఇంటి నుంచి బయటికెళితే.. క్షేమంగా తిరిగొస్తుందనే నమ్మకం ఉండదు. అందులోనూ ఇటీవల మహిళలపై జరుగుతున్న దారుణాలను మనం చూస్తూనే ఉన్నాం. ఈ కాలంలో ఎవరినీ నమ్మడానికి లేదన్నట్లుగా తయారైంది పరిస్థితి. బయటి వ్యక్తుల నుంచి సమస్యలు ఎదురైతే అమ్మకో, నాన్నకో చెప్పుకొంటాం. మరి నాన్నే సమస్యగా మారితే ఎవరికి చెప్పుకోవాలి. బెంగళూరులో ఇలాగే జరిగింది. ఇద్దరు యువతులను సొంత తండ్రే లైంగికంగా వేధించడం మొదలెట్టాడు. రోజూ లోలోపలే కుమిలిపోతూ.. చివరకు కళాశాలలోని తమ స్నేహితులతో బాధ పంచుకున్నారు. వివరాల్లోకి వెళితే..


బీహార్‌కు చెందిన దీపక్ కుమార్ సింగ్(46).. భార్య, ఇద్దరు కుమార్తెలతో కలిసి బెంగళూరులో నివాసం ఉంటున్నాడు. నగరంలోని ఓ క్యాంపస్‌లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంటాడు. వీరి కుమార్తెల్లో ఒకరు ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ చదువుతుండగా.. మరో కుమార్తె నాలుగో తరగతి చదువుతోంది. ఇతడికి ఇద్దరు భార్యలు ఉండగా.. మొదటి భార్య బీహార్‌లోనే ఉంటోంది. ఇదిలావుండగా.. ఇటీవల దీపక్ కుమార్ సింగ్.. తన పెద్ద కూతురిపై కన్నేశాడు. కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కూతురిని వక్ర దృష్టితో చూడడం మొదలెట్టాడు. మొదట బాలికకు అనుమానం కలగలేదు. తండ్రే కదా ప్రేమతో అలా ప్రవర్తిస్తున్నాడులే అనుకునేది.


అయితే రానురాను తండ్రి ప్రవర్తనలో చాలా తేడాలను గమనించింది. లైంగిక వేధింపులు ఎక్కవయ్యాయి. అయినా లోలోపలే భరించింది. అయితే రోజురోజుకూ తీవ్రమవుతుండడంతో విషయం తల్లికి తెలియజేసింది. ఈ విషయంలో భార్యాభర్తల మధ్య రోజూ గొడవలు జరుగుతుండేవి. దీంతో ఆ బాలిక మానసికంగా నరకం అనుభవించేది. చివరకు ఓ రోజు తన బాధనంతా కళాశాలలోని స్నేహితులతో పంచుకుంది. వారు ఓదార్చడంతో పాటూ తన సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని అనుకున్నారు. సోమవారం ఫుల్‌గా తాగొచ్చిన తండ్రి.. మళ్లీ వేధించడం మొదలెట్టాడు. దీంతో స్నేహితులకు ఫోన్‌ చేసి చెప్పింది. నలుగురు యువకులతో అక్కడికి చేరుకున్న ఆమె స్నేహితుడు.. ఇద్దరు కూతుళ్ల సమక్షంలోనే అతన్ని ఆయుధాలతో దాడి చేసి హత్య చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఒకరి కోసం గాలిస్తున్నారు. కేసు దర్యాప్తులో ఉంది.

Updated Date - 2021-11-24T03:16:56+05:30 IST